
BJP News(Telangana Political Updates): అమిత్షా వచ్చారు. చేవెళ్ల బహిరంగ సభలో మాట్లాడి వెళ్లిపోయారు. మరి, ‘షా’ షో.. బీజేపీకి బూస్ట్ ఇచ్చిందా? అది హిట్ షోనా? ఫట్ షోనా? అనే చర్చ నడుస్తోంది. మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది.
‘అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ఆ కోటా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం. అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపిస్తాం. ప్రధాని కుర్చీ ఖాళీలేదు. కేసీఆర్ ముందు సీఎంగా గెలవాలి. పేపర్ లీక్లపై నిలదీత’. సింపుల్గా చెబితే ఇదీ మేటర్. ఇందులో ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడిన అంశం ఒక్కటే కాస్త అటెన్షన్ క్రియేట్ చేసింది. మిగతావన్నీ రొటీన్ స్టేట్మెంట్స్ అంటున్నారు.
బహిరంగ సభలో ముస్లిం రిజర్వేషన్ల టాపిక్ ప్రస్తావించడం బీజేపీ పొలిటికల్ ఎజెండాలో భాగమేననే వాదన వినిపిస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే.. ఆ స్టేట్లో బీజేపీ మత ప్రాతిపదికన ఉద్రిక్తత రాజేస్తుందని ప్రతిపక్షాలు పదే పదే చేసే ఆరోపణలు. త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. ఇప్పుడు కావాలనే ముస్లిం రిజర్వేషన్ల అంశం తీసుకొచ్చారని అంటున్నారు. అమిత్షా స్థాయి నాయకుడు ఇలా మాట్లాడటం వ్యూహాత్మకమే అని చెబుతున్నారు.
తెలంగాణలో అమిత్షా సభ ఉంటుందని కొన్ని రోజులు ముందుగానే ప్రకటన వచ్చింది. అదే వేదికగా పలువురు కీలక నేతలు షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. పొంగులేటి, జూపల్లి.. ఇలా బడా నేతల పేర్లే వినిపించాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్లు ఢిల్లీలో మకాం వేసి బీజేపీ పెద్దలతో వరుస భేటీలు జరిపారు. అదిగో.. ఆ భేటీలు చేరికలపై క్లారిటీ కోసమేనని అన్నారు. కానీ, అమిత్షా సభలో కండువాలు కప్పే ప్రోగ్రామ్ కనిపించలేదు. ఒక్క చేరిక కూడా జరగలేదు. అంటే, బీజేపీలో చేరేందుకు నేతలు ముందుకు రావడం లేదా? చేరే వాళ్లు లేరా? ఉన్నా తొందరపడటం లేదా? పొంగులేటి మనసు మార్చేసుకున్నారా? జూపల్లి ఎందుకు చేరలేదు? ఇలా రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి.
ఇక, RRR టీమ్తో భేటీ రద్దు. ఆస్కార్ వచ్చినందుకు వాళ్లందరినీ అభినందిస్తానంటూ అమిత్షా షెడ్యూల్లో RRR బృందానికి 45 నిమిషాల సమయం కేటాయించారు. కానీ, ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, సభకు ముందుగానే ఆ భేటీ క్యాన్సిల్ అయింది. ప్రచారానికి సినిమా వాళ్లను వాడేసుకుంటున్నారనే విమర్శో మరేదో కానీ.. ఆ షెడ్యూల్ రద్దు కావడం మాత్రం మైనస్సే.
ఓవరాల్గా అమిత్షా సభ హిట్ అని కాషాయదళం సంబరపడుతోంది. షా షో తుస్ అని ప్రత్యర్థి పార్టీలు పండుగ చేసుకుంటున్నాయి.