
Drishyam movie crime : దృశ్యం(Drishyam movie) సినిమా చూసిన ఓ యువకుడు ఇద్దరు యువతులను ఒక మాస్టర్ ప్లాన్ వేసి హత్య చేశాడు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని పాల్ఘర్ ప్రాంతంలో గణేష్ మోహితే అనే యువకుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక క్లర్క్ ఉద్యోగం చేస్తున్నాడు. గణేష్ కుటుంబంలో కుటుంబంలో ఇద్దరు చెల్లెళ్లు (పార్వతి, సుధ- పేర్లు మార్చబడినవి) , తల్లి ఉన్నారు. అతనికి ఇంకా వివాహం కాలేదు. ఇటీవల గణేశ్ తన కుటుంబంతో కలిసి దసరా నవరాత్రి ఉత్సవాలకు సమీపంలోని తన స్వగ్రామం రెవదండాకు వెళ్ళాడు. అక్కడ కొద్ది రోజులు తన బంధువుల ఇంట్లో బసచేశాడు.
అక్టోబర్ 15న, గణేష్ తన బంధువుల ఇంటి నుంచి గ్రామంలో జరిగే నవరాత్రి ఉత్సవాలకు వెళ్లాడు. కొద్దిసేపటికే అతనికి తన సోదరి పార్వతి ఆరోగ్యం క్షీణించిందని.. వెంటనే తిరిగి రావాలని ఫోన్ వచ్చింది. గణేష్ ఇంటికి వచ్చి తన చెల్లిని తీసుకొని ఆస్పత్రికి వెళ్లాడు. కాసేపటి తరువాత గణేష్ మరో చెల్లెలు సుధకి కూడా వాంతులు మొదలయ్యాయి. ఇక ఆమెను కూడా ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. రెండు రోజుల తరువాత అక్టోబర్ 17న పార్వతి మరణించింది. అలాగే అక్టోబర్ 20న సుధ కూడా చనిపోయింది. వారిద్దరిపై విష ప్రయోగం జరిగిందని డాక్టర్లు తెలిపారు.
ఈ హత్యలు తన బంధువులే చేశారని గణేష్ , అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి తగాదాలు ఉండడం వల్ల బంధువులే ఈ హత్యలు చేసి ఉంటారని ఫిర్యాదులో గణేష్ పేర్కొన్నాడు. బంధువుల ఇంట్లో నీళ్లు తాగడం తరువాతనే పార్వతి, సుధకు ఆరోగ్యం క్షీణించిందని చెప్పాడు.
డబల్ మర్డర్ కేసులో విచారణ మొదలు పెట్టిన పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఆ కేసు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు బదిలీ అయింది.
క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసుని విచారణ చేయగా.. ఆ బంధువుల ఇంట్లో సిసి కెమెరా ఉందని తెలిసింది. ఆ సీసీ టీవి విడియోలు చూడగా.. సుధ, పార్వతి బంధువుల ఇంట్లో నీళ్లు తాగారు. కానీ వారితోపాటు వారి తల్లి కూడా అదే నీరు తాగింది. పార్వతి, సుధ తాగిన నీటిలో విషం ఉంటే.. వారి తల్లిపై కూడా విష ప్రభావం ఉండాలి. కానీ గణేష్ తల్లి ఆరోగ్యంగానే ఉంది. దీంతో కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చింది.
నిందితులైన గణేష్ బంధువులను పోలీసులు గట్టిగా ప్రశ్నించగా.. మరో విషయం తెలిసింది. గణేష్ తండ్రి చనిపోగా.. ఆయన ఉద్యోగం కోసం గణేష్, అతని చెల్లెళ్ల మధ్య గొడవ జరిగిందని. దీంతో పోలీసులు గణేష్ తల్లిని ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది.
గణేష్ తండ్రి చనిపోయాక, ఆయన ఉద్యోగం తనకు కావాలని పార్వతి కోరింది. ఇందుకు ఆమె తల్లి కూడా అంగీకారం తెలిపింది. కానీ గణేష్ ఈ విషయంలో తన తల్లితో విభేదించాడు. తనకు ఆ ఉద్యోగం రాకపోతే అందరినీ చంపేస్తానని బెదిరించాడు. దీంతో గణేష్ అనుకున్నది సాధించాడు. కానీ ఉద్యోగం వచ్చిన తరువాత కూడా కుటుంబంలో గొడవలు ఆగలేదు. ఉద్యోగం నుంచి వచ్చే వేతనం గణేష్ ఇంటి ఖర్చులకు ఇచ్చేవాడు కాదు. దీంతో సుధ, పార్వతి అతనితో గొడవపడేవారు.
ఇదంతా విన్న పోలీసులు.. గణేష్ను అదుపులో తీసుకొని అతని సెల్ ఫోన్ డేటా చెక్ చేశారు. అందులో ‘విషం‘, ‘తీయని విషం‘ అని 53 సార్లు గూగుల్ సెర్చ్ చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు తమ పద్ధతిలో గణేష్ను ప్రశ్నించారు. అప్పుడతను దృశ్యం సినిమా చూసి ఇదంతా ప్లాన్ చేశానని ఒప్పుకున్నాడు. తన ఇంట్లో హత్య చేస్తే అనుమానం తనపై వస్తుంది.. కాబట్టి బంధువుల ఇంటికి తీసుకెళ్లి చంపితే ఆ పోలీసులుకు బంధువలపైకి అనుమానం వస్తుందని చెప్పాడు.
బంధువుల ఇంట్లో తన చెల్లెళు తాగే నీటిలో తానే విషం కలిపి.. వెంటనే ఇంటి నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలకు వెళ్లిపోయానని అన్నాడు. ఆ తరువాత తన తల్లికి బంధువులపై అనుమానం కలిగేలా చెప్పానని నేరం అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు గణేష్ను అరెస్టు చేసి రెండు హత్యల కేసు నమోదు చేశారు.