
Sriharikota : మనదేశం అంతరిక్ష ప్రయోగం చేసినప్పుడల్లా తరచూ వినిపించే పేరు శ్రీహరి కోట. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సులోని ఒక ద్వీపమే శ్రీహరికోట. పులికాట్ సరస్సుకు, సముద్రానికి నడుమ ఉండే ఈ ద్వీపం విస్తీర్ణం 175 చదరపు కిలోమీటర్లు. ఇక్కడి సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచే మనం అనేక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాము. అయితే.. ఇంత సువిశాల దేశంలో ఎక్కడో విసిరేసినట్లుండే ఆ మారుమూల ద్వీపం అయిన శ్రీహరికోటలోనే ఈ అంతరిక్ష కేంద్రం ఎందుకు ఏర్పాటు చేశారనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది. దానికి ఉన్న కారణాలు, మన శాస్త్రవేత్తలు ఇచ్చే వివరణలు తెలుసుకుందాం.
ఇవీ కారణాలు..
ఒక రాకెట్ను అంతరిక్షంలోకి పంపేటప్పడు భూమ్యాకర్షణ శక్తి కారణంగా దానిని భూమి తనవైపు బలంగా లాక్కుంటుంది. ఈ ఆకర్షణ శక్తి.. ఇతర ప్రాంతాల నుంచి భూమధ్య రేఖకు దగ్గరగా పోయే కొద్దీ తగ్గుతుంది. మనదేశంలో భూమధ్యరేఖకు అతి దగ్గరగా ఉన్న ప్రదేశం.. శ్రీహరికోట. ఇతర ప్రదేశాల్లో కంటే.. ఇక్కడి నుంచి రాకెట్ను ప్రయోగిస్తే.. ఆ రాకెట్ సెకనుకు 0.4 కిలోమీటర్ల అదనపు వేగంతో పైకి దూసుకెళుతుంది. అంటే.. గంటకు 1140 కిలోమీటర్ల అదనపు వేగం అన్నమాట. అందుకే ప్రపంచంలో ఎక్కడ రాకెట్ ప్రయోగ కేంద్రాలైనా భూమధ్యరేఖకు సమీపంలోనే ఏర్పాటుచేస్తారు.
మన భూమి తనచుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఇది పడమర నుంచి తూర్పుకు తిరుగుతూ ఉంటుంది. అలాగే ఇది గంటకు లక్షా 8వేల కిలోమీటర్ల వేగంతో సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతోంది. భూమి తిరుగుతున్న దిశలో రాకెట్ను ప్రయోగిస్తే అదికూడా మంచి వేగాన్ని అందుకుని దూసుకుపోతుంది. అయితే, భూపరిభ్రమణ వేగం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కనుక .. రాకెట్ కూడా తూర్పు దిశగా ప్రయోగిస్తే, భూపరిభ్రమణ వేగం వల్ల అది మరింత స్పీడ్ను అందిపుచ్చుకుంటుంది.
సమాచార ఉపగ్రహాలు భూమధ్య రేఖకు సరిగ్గా ఎగువన, లేదంటే కాస్త అటుఇటుగా ఉండే భూస్థిర కక్ష్యలో తిరుగుతాయి. అప్పడే అవి.. భూమి ఆకర్షణకు గురికాకుండా, స్థిరంగా భూమిచుట్టూ తిరగగలవు. అందుకే ఇలాంటి చోటు నుంచి రాకెట్ను ప్రయోగిస్తే.. అది తనతో తీసుకుపోయిన ఉపగ్రహాన్ని భూమి కక్ష్యలోని సరైన చోటుకు చేరుస్తుంది. ఇలాగాక.. నచ్చినచోటు నుంచి రాకెట్ను పంపితే.. అది భూగురుత్వాకర్షణకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల దాని గమనంలో మార్పు వస్తుంది. అలాగే అది ఆ కక్ష్యలో నిలబడేందుకు చాలా శక్తి అవసరం. ఒక్కోసారి ఈ ఉపగ్రహాలు గతి తప్పి భూమి వైపు దూసుకు వచ్చే ప్రమాదమూ ఉంది.
రాకెట్ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత నేరుగా అంతరిక్షంలోకే దూసుకెళుతుందనే గ్యారెంటీ లేదు. టెక్నికల్ ప్లాబ్లం వస్తే.. అవి కూలిపోవటం ఖాయం. అదే.. పెద్దగా జన సంచారం, ఇళ్లు కానీ లేని శ్రీహరికోటకు 50 కి. మీ సముద్ర తీరం ఉంది. ఇక్కడ ప్రయోగించిన రాకెట్ కూలిపోయినా.. దాని శకలాలు సముద్రంలో పడిపోతాయి కనుక ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం ఉండదు.
రాకెట్ ప్రయోగాలకు పెద్ద పెద్ద యంత్రాలు, పరికరాలు అవసరం అవుతాయి. వీటిని దేశ విదేశాల నుంచి దిగుమతి, రవాణా చేసుకోవాల్సి రావచ్చు. శ్రీహరికోట ఈ భారీ యంత్రాల దిగుమతి, రవాణాలకు అత్యంత అనుకూల ప్రదేశం. భారీవర్షాలు, మండే ఎండలు కాసే ప్రదేశాలు రాకెట్ ప్రయోగాలకు అనుకూలం కాదు. శ్రీహరికోటలో ఏడాది పొడుగునా సాధారణ వాతావరణమే ఉంటుంది. ఇక్కడ అక్టోబర్, నవంబర్లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 10నెలలు ప్రయోగాలకు ఇది అనుకూల సమయమే.
రాకెట్ ప్రయోగం సమయంలో రాకెట్ లాంచ్ పాడ్ వద్ద భూమి తీవ్రంగా కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి దృఢత్వం ఉండాలి. శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత ధృడంగా ఉంటుంది. రాకెట్ ప్రయోగాల విషయంలో శ్రీహరికోటను మించిన ప్రదేశం మరొకటి భారతదేశంలో లేదు. అందుకే ఇది ‘రాకెట్ ప్రయోగాల కోట’ అయింది. నిజానికి అంతరిక్ష పరిశోధనా ప్రయోగ కేంద్రాన్ని మొదట కేరళలోని తుంబలో ఏర్పాటు చేశారు. తొలుత రాకెట్ల ప్రయోగ కేంద్రంగా ఉన్న తుంబ, తర్వాత పూర్తిస్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా మారింది