
Mushrooms : కేవలం 36 రూపాయల పెట్టుబడితో మిలియనీర్ కాగలమా? అదేం పెద్ద కష్టం కాదు. ఒడిసాకు చెందిన సంతోష్ మిశ్రా ఎదిగిన తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. పూరి జిల్లా దండముకుందాపూర్ ఆయన స్వగ్రామం. పేదరికం కారణంగా చదువు గ్రాడ్యుయేషన్ను మించలేదు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒడిసా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అంట్ టెక్నాలజీ యూనివర్సిటీలో చేరి పుట్టగొడుగుల పెంపకం శిక్షణ తీసుకున్నాడు మిశ్రా. అప్పటి వరకు పొదుపు చేసింది 36 రూపాయలు మాత్రమే. ఆ మొత్తంతోనే వర్సిటీలో మష్రూం విత్తనాలను కొనుగోలు చేశాడు.
తొలి ప్రయత్నంలో నాలుగు మష్రూం బెడ్లను తయారు చేసి విత్తితే.. మూడంటే మూడే పుట్టగొడుగులు వచ్చాయి. అధిక తేమ, అరకొర వెలుతురు, ఫంగల్ కంటామినేషన్ కారణంగా మష్రూం పంట దెబ్బతింది. ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటూ అప్పు తీసుకుని మరీ రెండో ప్రయత్నం చేశాడు.
1989 మేలో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో 100 బెడ్లు ఏర్పాటు చేశాడు. ఈ సారి 150 కిలోల పుట్టగొడుగుల దిగుబడి వచ్చింది. వేసవి అయినా అంత పెద్ద మొత్తంలో పంట రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సాధారణంగా వర్షాకాలంలో కానీ ఆ స్థాయిలో దిగుబడి లభించదు.
5.2 కిలోల మష్రూమ్స్ను రూ.120 చొప్పున విక్రయించాడు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. పుట్టగొడుగుల పెంపకానికి కొద్దిపాటి స్థలం సరిపోతుంది. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో 4-5 అంచెల వ్యవస్థను నెలకొల్పగలిగితే 1000 కిలోల వరకు పుట్టగొడుగులను తయారుచేయొచ్చు. ఏడాది పొడవునా వీటిని పెంచొచ్చు.
ఆశించిన ఫలితాలు రావడంతో మిశ్రా రూ.60 వేల అప్పు తీసుకుని అగ్రి బిజినెస్ను మరింత విస్తరించాడు. 3 వేల మష్రూం బెడ్లను ఏర్పాటు చేశాడు. వంద బెడ్ల నుంచి రోజుకి వంద కిలోల వరకు పుట్టగొడుగులను సాగు చేయగలిగాడు మిశ్రా. 1990 నాటికే నెలకు రూ.2500 ఆర్జించగలిగాడు.
పిప్లీలోని కళింగ మష్రూం సెంటర్ ఏర్పాటు చేసి పుట్టగొడుగుల విత్తనాల తయారీ, శిక్షణ ఇవ్వడం ఆరంభించాడు. ఒడిసాతో పాటు పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఆ వితనాలకు యమా గిరాకీ. పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించి 11 రాష్ట్రాల్లో 9 లక్షల మందికి మిశ్రా ఇప్పటి వరకు శిక్షణ ఇచ్చారు.