
Chandrayaan-3 Mission : చంద్రయాన్పై ప్రజ్ఞాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. విక్రమ్ ల్యాండర్ ఫోటోలను ప్రజ్ఞాన్ పంపించింది. చంద్రుడిపై వాతావరణాన్ని విక్రమ్, ప్రజ్ఞాన్ అధ్యయనం చేస్తున్నాయి. చంద్రుడిపై సల్ఫర్ కోసం విక్రమ్ శోధన చేస్తుండగా.. ఇంతవరకూ ప్రజ్ఞాన్ ఫోటోలను విక్రమ్ తీసింది. తాజాగా… విక్రమ్ ఫోటోలను తీసి ప్రజ్ఞాన్ పంపించింది. కొద్ది దూరంలోంచి ప్రగ్యాన్ రోవర్ ఫోటోలు తీసినట్లు తెలుస్తోంది. చంద్రుడి దక్షిణధృవంపై విక్రమ్ ల్యాండర్ దిగిన తర్వాత మొదటి ఫొటో పంపించింది.
బుధవారం ఉదయం 7 గంటల 35 నిమిషాలకు రోవర్ ఈ ఫోటోలను తీసిందని ఇస్రో ట్వీట్ చేసింది. ఫోటోలను రోవర్ నావిగేషన్ కెమెరాల ద్వారా తీసిందని.. ఈ కెమెరాలు ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ ల్యాబ్లో తయారయ్యాయని వెల్లడించింది.
మరోవైపు జాబిల్లిపై కాలుమోపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్… పరిశోధనలలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నాయి. పోటాపోటీగా కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ఉపరితలంపై మొట్టమొదటిసారిగా జరిపిన పరిశోధనల్లో సల్ఫర్ ఉనికిని రోవర్ గుర్తించింది. ప్రజ్ఞాన్లోని కీలకమైన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్ ఈ ఘనత సాధించింది. ఊహించిన విధంగానే ఆక్సిజన్, అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్లనూ గుర్తించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది. అక్కడ హైడ్రోజన్ జాడ కోసం అన్వేషణ జరుగుతోందని వివరించింది.
లిబ్స్ను.. బెంగళూరులోని ఇస్రో సంస్థ లేబొరేటరీ ఫర్ ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. ఇది చంద్రుడి ఉపరితలంపైకి తీవ్రస్థాయి లేజర్ కిరణాలను ప్రసరింపచేస్తుంది. వాటి తాకిడికి ఆ మట్టి తీవ్రస్థాయిలో వేడెక్కి ప్లాస్మా ఉత్పత్తవుతుంది.ఆ దశలో ఒక్కో మూలకం.. ఒక్కో తరంగదైర్ఘ్యంలో కాంతిని వెలువరిస్తుంది. వీటిని విశ్లేషించి మూలకాలను స్పెక్ట్రోమీటర్ గుర్తిస్తుంది. విక్రమ్ ల్యాండర్లోని ‘చాస్టే’ పరికరం ఇప్పటికే చంద్రుడి ఉపరితలం నుంచి కొంత దిగువకు వెళ్లి అక్కడి ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలను గుర్తించిందని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది.