
Moon : భూమి నుంచి 3 లక్షల 85 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రునిపై అతి తక్కువ ధరకే ఓపెన్ ప్లాట్లు. రండి బాబు రండి.. చందమామపై కొత్త వెంచర్. అతి తక్కువ ధరకే ఇండివిడ్యూవల్ ప్లాట్లు. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ కూడా ఉన్నాయండి. ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. అయితే వీటిని చూసి చాలా మంది నవ్వుకోవచ్చు. కానీ జాబిల్లిపై ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ నడుస్తోంది. ఇప్పటికే చందమామపై ల్యాండ్ కొన్నవాళ్లు ఉన్నారు. అందులో సినిమా స్టార్లు కూడా ఉన్నారు. చందమామపై రియల్ ఎస్టేట్ ఏంటి..? పిచ్చి ఎర్రి అనుకుంటున్నారా కానీ.. మీరు విన్నది నిజమే. క్లియర్ టైటిల్స్ లేకున్నా ఎగబడి కొనేస్తున్నారు.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కాగానే చంద్రుడిపై రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఊపందుకుంది. గోదావరిఖనికి చెందిన ఓ మహిళ తన తల్లి కోసం చంద్రుడిపై ఎకరం స్థలం కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో ఉంటున్న ఆమె మదర్స్ డే గిఫ్ట్గా తన తల్లికి చంద్రుడిపై ఎకరం స్థలం కొనడం ఆసక్తి రేపుతోంది.
చంద్రుని పై పరిస్థితులను ఇస్రో ఇంకా అధ్యయనం చేస్తోంది. కానీ కొంతమంది చంద్రునిపై ఎకరాల లెక్కన స్థలాలు కొనేస్తున్నారు. అమ్మేస్తున్నారు.1756లో చంద్రుడిపై ఊహల కబ్జా ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో ఓ కొత్తరకం ఘరానా మోసం వెలుగుచూసింది. ఇది అమెరికా కేంద్రంగా 16 ఏళ్ల క్రితం ఈ దగా వ్యాపారం మొదలైంది. అదీ చంద్రుడుపై ప్లాట్ల అమ్మకం పేరుతో. ఇందులో సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నారు.
హైదరాబాద్కు చెందిన రాజీవ్ బాగ్డే 20 ఏళ్ల క్రితమే 5 ఎకరాల భూమి చంద్రుడిపై కొనుగోలు చేశారు. చంద్రుడిపై మేర్ ఇంబ్రియం ప్రాంతంలో రాజీవ్కు ప్రాపర్టీ ఉంది. 2003లో కేవలం 140 డాలర్లకే ప్లాట్ కొనుగోలు చేశారు. న్యూయార్క్ లో ఉన్న లూనార్ రిజిస్ట్రీ ద్వారా రాజీవ్ 2003 జూలై 27న భూమిని రిజిస్ట్రర్ చేయించుకున్నారు. ఎప్పటికైనా చంద్రుని పై ఇల్లు కట్టుకుంటానని ఆయన చెబుతున్నారు.
బాలీవుడ్ నటులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, షారుఖ్ ఖాన్ లకు చంద్రమండలంపై స్థలం ఉంది. సుశాంత్ సింగ్ సొంతంగా కొన్నారు. షారుఖ్కేమో బహుమతిగా వచ్చింది. అరబ్ దేశంలో స్థిరపడిన మళయాళి మనికందన్ మిల్లోత్ పది ఎకరాలు కొనుగోలు చేశారు. జోధ్ పూర్ ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ మీనా బిష్ణోయ్ తన ఇద్దరు కుమార్తెల కోసం చంద్రునిపై భూమి కొనుగోలు చేశారు. అలాగే లూనార్ ఇంటర్నేషనల్ ఇచ్చిన సర్టిఫికేట్లను కూడా చూపించారు. అజ్మీర్ ధర్మేంద్ర అనిజా తన మ్యారేజ్ డేన తన భార్య సప్నా అనిజాకు జాబిల్లిపై 3 ఎకరాల భూమిని కానుకగా ఇచ్చారు.
ఇంతకూ చంద్ర మండలంపై స్థలం కొనుక్కోవచ్చా? అమ్మడానికైనా, కొనడానికైనా చంద్ర మండలం ఎవరిదైనా అయ్యుండాలి కదా? మరి ఇది ఎవరిది? చంద్ర మండలంపై స్థలాలు, అనేక ఖగోళ పదార్థాలను అమ్ముతామనే వెబ్ సైట్లు చాలా ఉన్నాయి. ఏ దేశానికి అంతరిక్షంపై హక్కులు లేవు. అంతర్జాతీయ అంతరిక్ష చట్టం ఉంది.ఇందులో అంతరిక్షానికి సంబంధించి 5 ఒప్పందాలు, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం చంద్రునిపై భూమి కొనుగోలును చట్టబద్ధంగా గుర్తించదు. కానీ కొన్ని సంస్థలు చంద్రుడిపై చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేయవచ్చని వాదిస్తున్నాయి.
లూనార్ రిజిస్ట్రీ, లూనార్ ల్యాండ్ అనే కంపెనీలు జాబిల్లిపై ప్లాట్ల వ్యాపారం సాగిస్తున్నాయి. ఈ సంస్థలు కొనుగోలుకు సంబంధించి సర్టిఫికేట్లు జారీ చేస్తున్నాయి. ఏ వెబ్ సైట్ చూసినా తమదే చట్టబద్ధమైనదని చెప్పుకొంటోంది. ఇవన్నీ సంపాదన కోసమేనని తెలుస్తోంది. ఈ సంస్థలు ఇతర గ్రహాలలో ఉన్న 2.66 మిలియన్ ఎకరాలను 45 వేల డాలర్లకు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా విక్రయించాయి. ఎకరం 29.99 డాలర్లుగా ధర కూడా నిర్ణయించి అమ్మకాలను ఆన్ లైన్ లో సాగిస్తున్నాయి.