
Sircilla : తాము ఎన్నాళ్లు ఓటర్లుగా ఉండాలి? నాన్లోకల్ అయినా నెత్తిన పెట్టుకోవాలా? ప్రభుత్వంలో కీలక పదవి ఉన్నా ఒకరగబెట్టింది ఏంటి? కనీసం కలిసి సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయింది? సిరిసిల్ల నియోజకవర్గంలో చూసినా ఇప్పుడు ఇదే నినాదం బలంగా వినిపిస్తోంది. మన ఓటు మనకే అంటూ పద్మశాలీలు గర్జిస్తున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఒక్క ముదిరాజ్కు కూడా టికెట్ దక్కలేదని ఆ వర్గం తీవ్ర నారాజ్లో ఉంది. తాజాగా పద్మశాలీలు కూడా భగ్గుమంటున్నారు. చేనేత అడ్డాలో ఈసారి మనబిడ్డనే గెలిపించాలంటూ ఇద్దరు పద్మశాలీ నేతలు స్వతంత్రులుగా పోటీ చేస్తూ కేటీఆర్కి గుబులు పుట్టిస్తున్నారు. మరోవైపు తీవ్ల అసంతృప్తితో గులాబీ పార్టీని వీడుతున్న నేతలు కాంగ్రెస్తోనే చేనేత వర్గాలు సహా అందరికీ మేలు జరుగుతుందని చెబుతున్నారు.
సిరిసిల్ల అనగానే టక్కున గుర్తుకు వచ్చేది చేనేత కార్మికులు. రాజకీయాల విషయానికి వస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ పేరు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కేటీఆర్కు రాజకీయ భిక్ష పెట్టారు ఈ ప్రాంతవాసులు. అయితే అతన్ని ఆదరించినంతగా చేనేత కార్మికుల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదనే అసంతృప్తి పద్మశాలీ సామాజికవర్గంలో నెలకొంది.
ఇక్కడ 90 వేలకు పైగా పద్మశాలి ఓటర్లు ఉన్నారు. నేతన్నల కోసం కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఇన్ని రోజులు కేటీఆర్ పక్షాన నిలిచారు. తమ సామాజికవర్గం నేతలు రాజీకయంగా కీలక పోస్టుల్లో ఉంటే మరింత న్యాయం జరుగుతుందని పద్మశాలీలు భావించారు. వేదికలు ఏర్పాటు చేసుకొని బరిలో నిలవాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా పద్మశాలీ సామాజికవర్గం నుంచి లగిషెట్టి శ్రీనివాస్, పత్తిపాక సురేష్ ఈసారి ఎన్నికల్లో కేటీఆర్కు ప్రత్యర్థులుగా పోటీకి దిగారు. ఇన్నాళ్లూ గంపగుత్తగా పద్మశాలీల ఓట్లు కేటీఆర్కు పోలయ్యేవి. ఈసారి అదే సామాజిక నేతలిద్దరూ పోటీ చేస్తుండటం గులాబీ అగ్రనేతకు ముచ్చెమటలు పట్టేలా చేస్తోంది.
సిరిసిల్లలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కేటీఅర్, కాంగ్రెస్ క్యాండెట్గా కేకే మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి రాణిరుద్రమ బరిలో ఉన్నారు. వీళ్లతో పాటు పద్మశాలి సామాజిక వర్గం నేతలు సమరానికి సై అంటున్నారు. పట్టణానికి చెందిన లగిషెట్టి శ్రీనివాస్ పద్మశాలి వర్గానికి చెందిన బలమైన నాయకుడు. గతంలో బీఆర్ఎస్ నేతగా.. సెస్ డైరెక్టర్గా గెలిచి వైస్ ఛైర్మన్ పదవిని చేపట్టారు. అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అహ్వానం మేరకు పార్టీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు.
సిరిసిల్ల పట్టణంలో సౌమ్యుడిగా పేరున్న లగిషెట్టి శ్రీనివాస్ కమలం టికెట్ ఆశించారు. చివరి వరుకు సిరిసిల్ల టికెట్ తనదే అనుకోగా అనూహ్యంగా రాణి రుద్రమకి బీజేపీ హైకమాండ్ టికెట్ కేటాయించింది. స్థానికుడైన తనని కాదని స్థానికేతరురాలైన రాణి రుద్రమకి అవకాశం ఇవ్వడాన్ని నిరసిస్తూ బీజేపీకి లగిషెట్టి శ్రీనివాస్ రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. తాను ఎప్పుడూ సిరిసిల్లలోనే అందుబాటులో ఉంటానని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. స్థానికేతరులు వద్దని.. పద్మశాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లగిషెట్టి శ్రీనివాస్ భరోసా ఇస్తున్నారు.
పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పత్తిపాక సురేష్ కూడా ఈసారి సిరిసిల్ల నుంచి ఏఐఎఫ్బీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గత కొంత కాలంగా హిందూ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించారు. సిరిసిల్ల పట్టణ యువకులతో సత్సంబంధాలు పెంచుకున్నారు. ఏఐఎఫ్బీ నుంచి పోటీ చేస్తున్న సురేష్ సిరిసిల్లకు స్థానికేతర ఎమ్మెల్యే వద్దని ముమ్మరం ప్రచారం చేస్తున్నారు. గెలుపు ఓటములు నిర్ణయించే స్థాయిలో ఉన్న పద్మశాలీలు మన ఓటు మనకే వేసుకోవాలని నినదిస్తున్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి కూడా అనుకూల పవనాలు వీస్తున్నాయి. బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించిన స్థానిక నేతలు ఆ పార్టీకి గుడ్బై చెబుతున్నారు. పార్టీలో తమకు కనీసం గుర్తింపు లేదని.. చిన్నచూపు చూస్తున్నారని ఫైరవుతున్నారు. పార్టీని వీడిన గడ్డం నర్సయ్య.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు లేఖ రాశారు. అందులో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడి బాధ్యతలిచ్చినా రూపాయి గౌరవ వేతనం లేదన్నారు. బయట జనంలో మాత్రం అన్ని వసతులు కల్పిస్తున్నారనే ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ఆరేళ్లైనా మాట నిలబెట్టుకోలనేదని గడ్డం నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సాధకబాధకాలు చెప్పుకునేందుకు కేటీఆర్గానీ.. కేసీఆర్ నుంచి గానీ స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్నాళ్లూ సిరిసిల్లలో కేటీఆర్కు విజయం నల్లేరుపై నడకగా సాగింది. అయితే ఇద్దరు పద్మశాలీ వర్గానికి చెందిన నాయకులు పోటీ చేస్తుండటం గులాబీ పార్టీకి ఆందోళన రేకెత్తిస్తోంది. దీనికితోడు స్థానిక నినాదం మార్మోగుతుండగా ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని హైకమాండ్ కంగారు పడుతోంది.
మరోవైపు బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడటం కలకలం రేపుతోంది. తమను ఎలాంటి ప్రాధాన్యం లేదని వాడుకొని వదిలేస్తున్నారని రాజకీయాల్లో విశ్వసనీయమైన వ్యక్తులుగా పేరున్న గడ్డం నర్సయ్య వంటి లీడర్లు ఆరోపిస్తుండటం కేటీఆర్కు ఎలాంటి ఫలితాలిస్తుందోనని స్థానిక గులాబీ నేతలు కంగారు పడుతున్నారు.