
P.Susheela : ఆమె మాట్లాడితే కోకిల కోసినట్లు ఉంటుంది. గంధర్వులు సైతం ఆశ్చర్యపోయే అద్భుతమైన గాత్రం కలిగిన గాన కోకిల పి సుశీల . ఆమె పాట పాడితే ఆ పాటకే ప్రాణం వచ్చినట్లు ఉంటుంది. విరహ గీతమైన.. వైరాగ్యమైన.. సరస సంగీతమైన.. భక్తి పారవస్యమైన.. పదం ఏదైనా.. పల్లవి ఏదైనా.. సుశీలమ్మ పాడితే ఆ పాట శ్రోతల హృదయాలను చల్లటి చిరుగాలిలా తాకి తీరుతుంది. ఆమె నోట తెలుగు తేనెలూరును.. అటువంటి గానగందర్వి పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి చాలా మందికి తెలియని ఒక విషయం గురించి తెలుసుకుందాం.
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుమారు 50 వేలకు పైగా పాటలు పాడి అందరి మనసులను ఓలలాడించిన గాయని సుశీల. తన సినీ జీవితంలో తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బెంగాలీ, ఒరియా, తుళు, బడగ, సింహళ, సంస్కృతం భాషలలో పాటలు ఆలపించారు. ఇప్పటికీ ఎప్పటికీ ఆమె పాడిన ఎన్నో పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. పులపాక సుశీల 1935 నవంబర్ 13 వ తారీకున సంగీతానికి పుట్టినిల్లు అయిన విజయనగరంలో జన్మించారు. ఆమె తండ్రి ముకుందరావు న్యాయవాది, తల్లి శేషావతారం.
సుశీల సంగీత ప్రస్థానానికి నాంది 1950లో రేడియోలో నిర్వహించిన ఒక పాటల పోటీతో మొదలయ్యింది. నేపథ్య గాయనిగా సుశీల అరంగేట్రం ఏ ఎమ్ రాజా తో కలిసి పాడిన కన్నతల్లి అనే తెలుగు సినిమాతో ప్రారంభమైంది. ఇక అది మొదలు దశాబ్దాల పాటు తెలుగుతో పాటుగా పలు భాషలలో తన గాత్రంతో సంగీత సామ్రాజ్యాన్ని మహారాణిలా ఏలింది . మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ ,బాలనాగమ్మ ,ఇల్లరికం ,మా ఇంటి మహాలక్ష్మి, భూకైలాస్, మాయాబజార్ ,సువర్ణ సుందరి ఇలా ఎన్నో ఆణిముత్యాల లాంటి పాటలు సుశీలమ్మ ఖాతాలో ఉన్నాయి.
ఇన్ని పాటలకు ప్రాణం పోసిన సుశీలమ్మ ఒక పాటను ససేమిరా పాడను అంటే పాడను అని బాధపడ్డారట. ఈ విషయాన్ని స్వయంగా ఆవిడే ఒక సందర్భంలో ప్రస్తావించారు. ఇంతకీ ఆ పాట ఏ సినిమాలోదో తెలుసా.. ఎన్టీ రామారావు డ్రైవర్ రాముడు చిత్రంలోని పాట “గ్గుగ్గుగ్గ గుడెసుందీ.. మ్మమ్మమ మంచముందీ’’ గుర్తుందా. ఆ మాస్ పాట ఇప్పటికీ ఎప్పటికీ మంచి పవర్ఫుల్ బీట్ సాంగ్ గానే మిగిలిపోయింది. అయితే ఈ పాట పాడిన తర్వాత చాలా రోజులపాటు సుశీలమ్మ పాడినందుకు మనస్థాపం చెందారట. ఈ సాంగ్ తో పాటు ఈ మూవీలో అన్ని సాంగ్స్ కూడా సుశీల గారు ఆలపించారు. అప్పట్లో పాటలు నచ్చినా..నచ్చకపోయినా పాడాల్సి వచ్చేదని సుశీలమ్మ గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.