![](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/12/59b425a2a6c7b31f53f60257c7bd8c6b.jpg)
Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బరేలీ వద్ద జాతీయ రహదారిపై కారు-ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి 8 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉండటం కలచివేస్తోంది.
శనివారం రాత్రి బాధితులంతా ఓ వివాహ వేడుకకు హాజరై వస్తుండగా.. భోజిపురాలోని బరేలీ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. కారు టైరు పేలడంతో అదుపుతప్పి అవతలి రోడ్డులో ఉత్తరాఖండ్ నుంచి ఇసుక లోడ్ తో వస్తున్న ట్రక్కును ఢీ కొట్టి నుజ్జు నుజ్జైంది. కారును ట్రక్కు కొద్దిదూరం వరకూ ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. అదే సమయంలో కారు సెంట్రల్ లాక్ పడటంతో.. లోపలున్నవారు తప్పించుకునే వీలు లేకపోయింది.
కారులో ఉన్నవారంతా మంటల్లో సజీవదహనమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కారు నుంచి చిన్నారి సహా ఏడుగురి మృతదేహాలను బయటకు తీశారు. బాధితులను గుర్తించి వారు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.