BigTV English

KCR Support To Jagan: వైఎస్ జగన్ కు అండగా బీఆర్ఎస్?

KCR Support To Jagan: వైఎస్ జగన్ కు అండగా బీఆర్ఎస్?

పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే యువకుడు హత్యకు గురవ్వడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో రాష్ట్రంలో జరిగిన మారణకాండ వివరాలను చక్కగా చదివి వినిపించారు. నిఘా వర్గాలు తనకు నివేదిక ఇచ్చినట్లు.. రాష్ట్రవ్యాప్తంగా 36 హత్యలు, 35 ఆత్మహత్యలు, 300 హత్యాయత్నాలు జరిగిపోయాయని తెగ ఆందోళన వ్యక్తం చేశారు. పనిలో పనిగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ఫలితాలు వెలువడి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన ఇన్ని రోజులకు పల్నాడు పర్యటన పేరుతో మొదటి సారి పులివెందుల ఎమ్మెల్యే జనంలోకి వచ్చారు. ఏపీలో అరాచక పాలనపై ప్రధానికి ఫిర్యాదు చేసి .. ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్నారు. పార్టీకి ఉన్న నలుగురు ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలతో హస్తిన వేదికగా.. ‘సింబాలిక్ ప్రొటెస్ట్’ చేస్తారంట.. అదేమంటే ఏపీలోశాంతి భద్రతలు లోపించాయనీ దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.


ఢిల్లీ వెళ్లి సింబాలిక్ ధర్నా చేస్తానంటున్న వైసీపీకి మద్దతుగా వచ్చే పార్టీలే కనిపించడం లేదు. వైసీపీ నేతలు వెళ్లి అడిగినా తోడుగా వచ్చే పార్టీలు కాని  ఒకవేళ ఏవైనా ఒకటి అరా పార్టీలు మద్దతు ఇస్తామన్నా తీసుకునే పరిస్థితి వైసీపీకి కాని లేదంటున్నారు. దానికి వైసీపీ కేంద్రంతో వ్యవహరించిన తీరే కారణమంటున్నారు .. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆ పార్టీకి వైసీపీ అప్రకటిత మిత్రపక్షంగా కొనసాగింది. అక్రమాస్తుల కేసుల భయంతో ఎన్డీఏ సర్కారుకు దాసోహం అన్నట్లు వ్యవహరించింది.

మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో బీజేపీతో నేరుగా ఒక్క సారి కూడా పొత్తులు పెట్టుకోలేదు. 2019లో వైసీపీ నేరుగా బీజేపీకి పొత్తుల ఆఫర్ ఇచ్చినప్పటికీ వర్కవుట్ కాలేదన్న ప్రచారం ఉంది. అయితే బీజేపీని ఎప్పుడూ వైసీపీ దూరం చేసుకోలేదు. తమకు ఉన్న ఎంపీల బలంతో ఎప్పుడు బీజేపీకి అవసరమైతే అప్పుడు మద్దతిస్తూ ఇస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీని చిత్తుగా ఓడించింది. వైసీపీకి వ్యతిరేకంగా ఈ కూటమి పోటీ చేసినా సరే.. జగన్ బీజేపీని కాదనలేకపోతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆయన బీజేపీకి మోకరిల్లుతున్నట్లే కనిపిస్తున్నారు.

ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది. జనసేన ఉంది. అసలు రెండో సారి ఆ కూటమి ఏర్పాటులో జగన్‌ని గద్దె దించడమే లక్ష్యంగా పవన్‌కళ్యాణ్ కీరోల్ పోషించారు .. అలాంటి కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి మద్దతివ్వడం నైతికంగా కరెక్ట్ కాకపోయినా జగన్ అదే బాటలో పయనిస్తున్నారు. ప్రధాని మోడీ, అమిత్‌షా, రాష్ట్రపతిల అపాయింట్‌మెంట్ అడిగానని ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తానని అంటున్నారు. అయితే వారి అపాయింట్‌మెంట్ దొరకడం కష్టమే అన్న టాక్ వినిపిస్తుంది. ఇక జగన్ ధర్నాకి ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ మద్దతిచ్చే పరిస్థితి లేదు.

Also Read: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, జగన్ హాజరు.. గవర్నర్ స్పీచ్‌కే పరిమితం..

ఇండియా కూటమిలో పార్టీలతో జగన్‌కు సాన్నిహిత్యం లేదు. కాంగ్రెస్ పార్టీపై ఆయన గతంలో తీవ్ర విమర్శలు చేశారు. తండ్రి మరణించినప్పుడు తనను సీఎం చేయలేదని కాంగ్రెస్‌తో విభేదించి బయటకొచ్చిన జగన్‌ని కాంగ్రెస్ హైకమాండ్ బద్ద శత్రువులా చూస్తుంది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం బీజేపీ ప్రాపకం కోసం రాహుల్ గాంధీపై బయట, పార్లమెంట్ లో విమర్శలు చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మద్దతిచ్చే అవకాశం లేదు. ఇండియా కూటమిలో ఇతర పార్టీలతోనూ ఆయనకు సంబంధాలు లేవు. దాంతో ఇండియా కూటమి కూడా జగన్‌తో టచ్‌ మీ నాట్ అన్నట్లే వ్యవహరిస్తుందనడంలో సందేహమే లేదు.

ఢిల్లీలో ధర్నా చేస్తున్న తమకు మద్దతివ్వాలని జగన్ ఇతర పార్టీలను అడిగే పరిస్థితి అసలే కనిపించదు. ఏపీలో ఎన్డీఏ సర్కార్ కు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నానని చెప్పి ఇండియా కూటమి నేతల్ని ఆయన అడగలేరు. వారు వస్తానన్నా రండి అని చెప్పే ధైర్యం జగన్‌కి లేదు. జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారని బిజెపికి తెలిస్తే వచ్చి పడే ప్రమాదాల గురించి జగన్‌కు బాగా తెలుసు. ఎవరైనా వస్తానన్నా వద్దనాల్సిన దుస్థితి ఆయనది. అలాగని ఎన్డీఏ పార్టీ నేతల్ని ఆహ్వానించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉంది టీడీపీ, జనసేనలే.. ఆ రెండు పార్టీలను కాదనే సాహసం కూటమిలో ఎవరూ చేయలేరు.

ఎన్డీఏ, ఇండియా కూటముల్లో లేని తటస్థ పార్టీలతో జగన్‌కి పరిచయం లేదు. వారికి కూడా వైసీపీతో అవసరం లేదు. ఇక ఇస్తే గిస్తే ఒక బీఆర్ఎస్ మాత్రమే వైసీపీకి మద్దతు తెలిపే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గులాబీ పార్టీ కూడా ఆ డెసిషన్ తీసుకోదంటున్నారు. ఒక వేళ బీఆర్ఎస్ సంఘీభావం తెలిపినా.. వైసీపీప్రయోజనం కంటే రాజకీయంగా నష్టమే ఎక్కువ ఉంటుందంటున్నారు. మరి చూడాలి మాజీ ముఖ్యమంత్రి తన ‘సింబాలిక్ ప్రొటెస్ట్’ తో ఏం సాధిస్తారో

Related News

Yellandu Politics: ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పెత్తనంపై వ్యతిరేకత..

Congress: కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందా..?

Srikakulam Politics: దువ్వాడ కుల రాజకీయం

KCR: కేటీఆర్ కామెంట్స్.. బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటో?

BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్..

Bigg Boss AgniPariksha E3 Promo1: ఎమోషన్స్ తో చంపేస్తున్న సామాన్యులు.. వర్కౌట్ అవుతుందా?

Big Stories

×