![](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/11/480167897cc43b2fb914238f45d7dbbf.jpg)
Maharashtra Crime: వంట రుచిగా లేదని కన్నతల్లిని కర్కశంగా కడతేర్చాడో కొడుకు. ఆపై తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుర్తించిన బంధువులు.. ఆస్పత్రికి తరలించగా ప్రాణాలతో బయటపడ్డాడు. మాహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మహారాష్ట్రలోని థానే జిల్లా ముర్బాద్ తాలూకాలోని వేలు గ్రామానికి చెందిన ఓ యువకుడు తరచూ తన తల్లితో గొడపడేవాడు. ఇంట్లో సమస్యలపై ఇద్దరి మధ్య గొడవలయ్యేవి. ఆదివారం (నవంబర్ 26) సాయంత్రం ఇంటికొచ్చిన కొడుక్కి తల్లి భోజనం వడ్డించింది. భోజనం చేసిన అతను.. వంటలు బాలేవంటూ తల్లితో మళ్లీ గొడవపడ్డాడు. కోపంతో ఆమె మెడపై కొడవలితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇరుగుపొరుగు వారు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఘటన అనంతరం యువకుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయగా అతడిని బంధువులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతుండటంతో ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీస్ అధికారి వెల్లడించారు.సెక్షన్ 302 కింద సోమవారం కేసు నమోదు చేసినట్లు థానే రూరల్ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారి మీడియాకు తెలిపారు.