![](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/11/1fe6eda65dcd46c3a5ad1789c3bf08f5.jpg)
NEET Student : రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 27 మంది ఆత్మహత్యకు పాల్పడగా.. తాజాగా మరో విద్యార్థి బలవన్మరణం చెందాడు. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఫరీద్ (20) స్నేహితులతో అద్దెకు ఉంటున్న గదిలో ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అతని స్వస్థలం పశ్చిమబెంగాల్ గా గుర్తించారు.
ఫరీద్.. తనతో పాటు నీట్ కు సిద్ధమవుతున్న మరికొందరితో కలిసి నగరంలో ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు. సాయంత్రం 7 గంటల వరకూ ఫరీద్ తమతోనే ఉన్నాడని.. ఆ తర్వా గదిలోకి వెళ్లి, లోపల గడియపెట్టి తలుపు తట్టినా తీయకపోవడంతో యజమానికి చెప్పినట్లు పోలీసులకు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గది తలుపులను తెరిచారు. అప్పటికే ఫరీద్ సీలింగ్ కు వేలాడుతూ కనిపించగా.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు నిర్థారించారు. కాగా.. ఫరీద్ ఆత్మహత్యకు కారణమేంటో తెలియదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండటంతో.. అందుకు నివారణగా అన్ని కోచింగ్ సెంటర్లలో యాంటీ హ్యాంగింగ్ పరికరాలను అమర్చాలని స్థానిక ప్రభుత్వం నిర్వాహకులను ఆదేశించింది.