Lok Sabha Elections 2024: ఎన్నికల పోలింగ్ సమయంలో ఎంతో మంది ఓటు వేయడానికి బద్దకిస్తూ ఉంటారు. వివిధ కారణాలు చెబుతూ ఓటు హక్కు వినియోగించుకోరు. అందుకేే తక్కువ ఓటింగ్ నమోదవుతోంది. అయితే అలాంటి వారికి బెంగుళూరుకు చెందిన ఓ వృద్ధురాలు స్పూర్తిగా నిలుస్తోంది. అనారోగ్యంతో ఉన్నా పోలింగ్ కేంద్రానికి ఆక్సిజన్ సపోర్టుతో ఓటు వేయడానికి వెళ్లింది.
బెంగుళూరులోని జయానగర్కు చెందిన కళావతి అనే వృద్ధురాలు న్యూమోనియాతో బాధపడుతోంది. తీవ్ర దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక మణిపాల్ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు ఆమెకు న్యూమోనియా ఉందని నిర్థారించారు. దీంతో ఆమెకు ఆక్సిజన్ థెరపీతోపాటు యాంటీబయోటిక్స్, ఇతర వైద్య సేవలు కొనసాగిస్తున్నారు.
Also Read: దేశ వ్యాప్తంగా ముగిసిన రెండో విడత
తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆ వృద్ధురాలు..లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయాలని నిర్ణయించుకుంది. అయితే అదే విషయాన్ని డాక్టర్లతో చెప్పగా ఆమె ఉత్సాహాన్ని గమనించిన సిబ్బంది అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జయానగర్లోని పోలింగ్ కేంద్రానికి అంబులెన్సులో ఆమెను తరలించారు. సిబ్బంది సహాయంతో స్ట్రెచర్పైనే లోనికి వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకుంది. అనంతరం తన వేలుకు ఉన్న సిరాను చూపుతూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆమె తీసుకున్న చొరవ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.