వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో డొక్కా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వైసీపీపై అసంతృప్తితో పార్టీ సభ్యత్వానికి, గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారు. వైసీపీకి రాజీనామా చేసి.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన టీడీపీలో చేరారు. ఆయనను పార్టీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.
వైసీపీ అధిష్ఠానం డొక్కా మాణిక్య వరప్రసాద్ కు టికెట్ కేటాయించపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అయితే టీడీపీ కూడా ఇప్పటికే పొత్తులో భాగంగా అన్ని అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మాజీ మంత్రి డొక్కాకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ కేటాయించే అవకాశం దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవచ్చు.
Also Read: టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి యనమల కృష్ణుడు
టీడీపీ అధినేత చంద్రబాబు.. డొక్కా మాణిక్య వరప్రసాద్ కు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. డొక్కాకు ఎమ్మెల్సీ పదవి ఫిక్స్ అంటూ గుంటూరులో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే టీడీపీ.. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో డొక్కాకు ఏ పదవి కేటాయిస్తుందో వేచి చూడాల్సిందే.