YS Sharmila Vs YS Avinash in Kadapa Constituency Who will Win..?: కడప సిస్టర్స్ వైఎస్ షర్మిల, డాక్టర్ సునీతలు పులివెందులలో ప్రచారయుద్దం మొదలుపెట్టారు .. వారిద్దరు వైఎస్ వివేకా సెంటిమెంట్తో ఏకధాటిగా సంధిస్తున్న ప్రశ్నలు జగన్కు ఊపిరి సలపనివ్వడం లేదంట. కడప ఎంపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న షర్మిల విజయావకాశాలు ఎలా ఉన్నా .. ఆమె ఎఫెక్ట్తో వైసీపీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుందంటున్నారు. ఇన్నాళ్లూ ఎదురేలేదనుకున్న జిల్లాలో ప్రధాన ప్రత్యర్ధి కూటమి కంటే ఆ అక్కచెల్లెళ్ల దూకుడుతో జగన్ టీంకి ముచ్చెమటలు పడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ క్రమంలో వైసీపీలో క్రాస్ ఓటింగ్ టెన్షన్ మొదలైందంట.
ఎన్నికల ప్రచారం పర్వం చివరి దశకు చేరింది. ఏపీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేలుస్తూ దూకుడు పెంచుతున్నాయి. ఈ సారి రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కడప రాజకీయం .. ఇంత కాలంతో సొంత జిల్లాలో తనకు ఎదురులేదనుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్కి పరుపు కింద గొడ్డలిలా తయారయ్యారు చెల్లెళ్లు వైఎస్ షర్మిల, సునీతలు .. వివేకా హత్యే ప్రధాస్త్రంగా వారు ఎక్కుపెడుతున్న ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక .. వైసీపీ నేతలు నానాపాట్లు పడుతున్నారు.
వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్రెడ్డి, జగన్లు షర్మిల, సునీతలకు టార్గెట్ అవుతున్నారు .. ఆ క్రమంలో జగన్ సతీమణి భారతి ఇంటింటి ప్రచారంతో చెమటోడ్చుతున్నారు. భారతి తన ప్రచారంలో జగన్ సింగిల్ ప్లేయర్ అని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు కడప ఎంపి అభ్యర్ధి, పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల్.. తన అన్న జగన్ ఓ ఊసరవెల్లి.. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే.. అంటున్న షర్మిల .. వదినపై కూడా ఫైర్ అవుతున్నారు. గొడ్డలి తీసుకుని వారికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ నరికేసి వారు మాత్రమే ఎన్నికల్లో సింగల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా భారతి స్ట్రాటజీ? అని ప్రశ్నిస్తున్నారు.
Also Read: YS Sharmila Vs CM Jagan: కడపలో జగన్ కు షర్మిల చెక్ పెడుతుందా.?
రాజకీయాలకు కొత్త అయిన వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత కడపలో షర్మిలకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటూ.. తన తండ్రి హత్యపై ప్రజలకు ప్రశ్నలు సంధిస్తున్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది? వివేకా హత్య జరిగిన రోజు అవినాష్రెడ్డి.. భారతితో ఫోన్లో ఏం మాట్లాడారని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఆ సిస్టర్స్ ఏకధాటిగా సంధిస్తున్న ప్రశ్నలు జగన్కు ఊపిరి సలపనివ్వడం లేదంట. ఆ అక్కచెల్ళెళ్లు లెవనేత్తే ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పే వారే కనిపించడం లేదు జగన్ పార్టీలో చివరికి జగనే రంగంలోకి దిగి పులివెందుల నడిబొడ్డున వైఎస్ అవినాష్రెడ్డి ‘చిన్న పిల్లాడు’ అంటూ వెనుకేసుకొచ్చారు. వైఎస్ అవినాష్ ఏం తప్పు చేయలేదని తాను బలంగా నమ్మాను కాబట్టే అవినాష్ కు తిరిగి టికెట్ ఇచ్చానని అవినాష్ను రాజకీయంగా కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని .. తమ అందరి కంటే చిన్నవాడైన అవినాష్ జీవితం నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
అదే టైంలో తన చెల్లి చీరపై జగన్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఆ క్రమంలో అవినాష్ను వెనకేసుకుని వస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదనన్ అభిప్రాయం వ్యక్తమైంది. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరడంతో షర్మిల, సునీతలు పులివెందులలో గల్లీగల్లీ తిరుగుతూ వైసీపీపై తమ డైలాగ్లతోపిడుగుల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడుతున్న ప్రతి మాటకీ వారు కౌంటర్ ఇస్తున్నారు. గత ఎన్నికల ముందు పలు హామీలిచ్చి తప్పడంపైనా మాటలతో చీల్చిచెండాడుతున్నారు. కడప వాసులకు వివేకాతో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేస్తూ ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారో తేల్చుకోవాలని అభ్యర్ధిస్తున్నారు.
Also Read: రోజా Vs జబర్దస్త్ టీమ్
సునీత పొలిటికల్ పంచ్లు లేకపోయినా ప్రశ్నలతో అవినాష్, జగన్లను నిలదీస్తున్నారు. తన తండ్రి హత్యపై న్యాయపోరాటం చేస్తున్న ఆమె .. అన్ని కోర్టులు తిరిగానని.. ఇప్పుడు న్యాయం కోసం మీ ముందుకు వచ్చానని పులివెందుల ప్రజల్ని కోరుతున్నారు .. న్యాయం వైపు నిలుస్తారో? నిందితుడి వైపు నిలుస్తారో తేల్చుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
జగన్కు షర్మిల, సునీత సంధిస్తున్న ప్రశ్నలు నేరుగా ప్రజలను ఆలోచింపజేస్తున్నట్లే కనిపిస్తున్నాయి .. వాస్తవానికి కడప జిల్లాలో ఊరూరా వివేకా అభిమానులు కనిపిస్తారు. ఆయన ద్వారా లబ్దిపొందిన వారు ఉన్నారు. అలాంటి వారంతా ఈ సారి క్రాస్ ఓటింగ్కు పాల్పడే పరిస్థితి ఉందని .. వైసీపీకి అది ఎంతోకొంత నష్టం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.. పులివెందులతో పాటు కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల, కడప, ప్రొద్దుటూరు, బద్వేలులో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇప్పుడు అదే వైసీపీలో గుబులు పుట్టిస్తోందంట.
Also Read: AP Election 2024: తుది దశకు ప్రచారాలు.. ఓటర్లకు ప్రలోభాల ఎర.?