CM Revanth reddy comments on BJP(Telangana politics): ప్రధాని మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ గడీలు బద్దలు కొట్టి ప్రజాపాలన తెచ్చుకున్నామని అన్నారు. సంగారెడ్డి జిల్లా పెద్ద శంకరంపేట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు.
పేదలకు కార్పోరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశ పెట్టిందని అన్నారు. కానీ బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. మహిళల కోసం దీపం పథకం కింద సిలిండర్లు ఇస్తే.. వాటి ధరను కూడా మోదీ పెంచారని మండిపడ్డారు.
Also Read: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు వీరే..
బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని ఎద్దేవా చేశారు. బ్రిటీష్ వాళ్ల లాగే.. బీజేపీ నేతలకు కూడా రిజర్వేషన్లు నచ్చవని అన్నారు. కార్పొరేట్ కంపెనీల కుట్రలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ భావిస్తోందని తెలిపారు. మోదీ దేశాన్ని కార్పొరేట్ వ్యాపారుల చేతిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన సంస్థలను బీజేపీ అమ్ముకుంటోందని ఆరోపించారు. ఈసారి 400 సీట్లు గెలిచి.. రాజ్యాంగం మార్చాలని మోదీ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.