IMF warns of economic slowdown
కొత్త సంవత్సరం ఆరంభంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-IMF బాంబు పేల్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు ఈ ఏడాది మాంద్యంలోకి జారొచ్చని హెచ్చరించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనాల్లో ఆర్థిక పరిస్థితులు 2022 కంటే ఈ ఏడాది ఇంకా క్లిష్టంగా మారొచ్చని అన్నారు… ఐఎంఎఫ్ అధిపతి క్రిస్టాలినా జార్జివా. ఆయా ఆర్థిక వ్యవస్థల్లో తీవ్ర మందగమనం చోటు చేసుకోవచ్చని… ఓ వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆర్థిక ప్రతికూల వాతావరణమే కనిపిస్తోందన్నారు… జార్జివా. పది నెలలుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించకపోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి అన్ని దేశాల్లో వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతుండటం, చైనాలో మళ్లీ కోట్ల కొద్దీ కరోనా కేసులు బయటపడుతుండటంతో… 2023లో ప్రపంచంలో మూడో వంతు మాంద్యంలోకి వెళ్లొచ్చని జార్జివా అభిప్రాయపడ్డారు. మాంద్యం లేని దేశాల్లోనూ… కోట్ల మంది ప్రజలు మాంద్యం భయాల్లో చిక్కుకోవచ్చని చెప్పారు.
నిరుడు అక్టోబర్లోనే… 2023లో ప్రపంచ వృద్ధి అంచనాల్లో కోత వేసింది… ఐఎంఎఫ్. 2021లో 6 శాతంగా నమోదైన అంతర్జాతీయ వృద్ధి… 2022లో 3.2 శాతానికే పరిమితమైంది. ఇది 2023లో ఇంకా తగ్గి 2.7 శాతానికి పడిపోవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2008 నాటి అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం, తీవ్ర కరోనా పరిస్థితుల సమయాన్ని మినహాయిస్తే… 2001 తర్వాత ఇదే అత్యంత బలహీన వృద్ధి. రాబోయే కొన్ని నెలల్లో చైనా మరిన్ని సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావొచ్చని… ఆ దేశ వృద్ధి ప్రతికూలం దిశగా పయనిస్తే, ఆ ప్రభావం ప్రపంచ వృద్ధిపైనా పడుతుందని ఐఎంఎఫ్ చీఫ్ జార్జివా అన్నారు. చైనా తన ‘జీరో కొవిడ్’ విధానానికి స్వస్తి పలకడం వల్ల కరోనా కేసులు పెరిగి… ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావొచ్చని చెప్పారు.