Big Stories

Peddireddy Family Vs NDA Alliance: పెద్దిరెడ్డి పెత్తనమా..? మా ప్రతాపమా..?

Chittoor District 2024 Election Survey Report: ఉమ్మడి చిత్తూరు జిల్లా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. జీ సీఎంలు కిరణ్, చంద్రబాబుల సొంత జిల్లా చిత్తూరు. ఇప్పుడా ఇద్దరు ఎక్స్ సీఎంలు ఆ జిల్లాకే చెందిన వైసీపీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. పుంగనూరు నుంచి పోటీలో ఉన్న పెద్దిరెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. రాజంపేట ఎంపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి.. అక్కడ పెద్దిరెడ్డి వారసుడు ఎంపీ మిథున్‌రెడ్డికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అటు పెద్దిరెడ్డి సైతం అటు కుప్పంలో చంద్రబాబుని ఇటు కిరణ్‌ని ఓడిస్తానని ప్రచారంలో ప్రకటించారు. ఆ క్రమంలో పుంగనూరులో పెద్దిరెడ్డి విజయంతో పాటు జిల్లాలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.

- Advertisement -

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలింగ్ పర్వం ముగిసింది. జిల్లా వాసుల తీర్పు ఈవీఎంలలో దాక్కుని అందర్నీ ఊరిస్తుంది. చిత్తూరు జిల్లా వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో వరుసగా నాలుగో సారి గెలవాలని చూస్తున్నారు. ఆయన కొడుకు మిధున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. మరోవైపు ముందునుంచి పెద్దిరెడ్డి కుటుంబానికి బద్దశత్రువులుగా ఉంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా ఏడు సార్లు విజయం సాధించిన కుప్పంలో విజయపరంపర కొనసాగించడానికి సిద్దమయ్యారు. జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టాలని చూస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు అదే జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తోడయ్యారు.

- Advertisement -

మిధున్‌పోటీ చేస్తున్న రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని పీలేరు నియోజకవర్గంలో నల్లారి కుటుంబానికి మంచి పట్టుంది.. అక్కడి నుంచి గెలిచే కిరణ్ ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు.. రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలతో కిరణ్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి పీలేరు నుంచి జనసేన, టీడీపీల తరపున పోటీ చేసి పరాజయం పాలైనప్పటికీ  నియోజకవర్గంలో తన పట్టు కొనసాగిస్తున్నారు. పెద్దిరెడ్డి వర్గానికి చెందిన పీలేరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఓడిస్తానన్న నమ్మకంతో కిషోర్ కనిపిస్తున్నారు.

Also Read: ఎన్నికల తర్వాత కనిపించని పవన్ కల్యాణ్.. జనసేనాని ఎక్కడ..?

నల్లారి, పెద్దిరెడ్డిలకి కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచే విభేదాలున్నాయి. ఒకే పార్టీలో ఉన్నా బద్ద శత్రువుల్లా వ్యవహరిస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీ నుంచి రాజంపేట ఎంపీగా మిధున్‌రెడ్డిపై పోటీకి దిగారు. మరోవైపు కుప్పంలో తనను ఓడిస్తానంటున్న పెద్దిరెడ్డికి పుంగనూరులో చెక్ పెట్టడానికి చంద్రబాబు బలమైన రాజకీయ నేపధ్యం ఉన్న చల్లా బాబుని రంగంలోకి దించారు. చల్లాబాబు జిల్లా రాజకీయాల్లో చంద్రబాబుకు సమకాలీకుడైన పెద్దిరెడ్డిని ఈసారి ఓడిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రాయలసీమ జిల్లాలలో వైసీపీ రాజకీయాలను పెద్దిరెడ్డి శాసిస్తున్నారు. పార్టీ వ్యవహారాలు మొదలు అభ్యర్థుల ఎంపిక వరకు అంతా పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరిగింది. రాజకీయంగా రాష్ట్ర వ్యవహారాల్లో బిజీగా ఉండి జిల్లా రాజకీయలను చంద్రబాబు నిర్లక్ష్యం చేయడం, పదేళ్లుగా కిరణ్‌కుమార్‌రెడ్డి పొలిటికల్ స్క్రీన్‌పై కనిపించకపోవడంతో జిల్లాలో పెద్దిరెడ్డికి ఎదురు లేకుండా పోయింది‌. ఆ క్రమంలో ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల్లో కుప్పంలో మాత్రమే టీడీపీ విజయం సాధించగలిగింది.

చిత్తూరు జిల్లాలో మెజారిటీ సీట్లు వైసీపీకి దక్కడం వెనక పెద్దిరెడ్డి కీలక పాత్ర వహించారు. గత ఎన్నికల్లో తన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డిని తంబల్లపల్లి ఎమ్మెల్మేగా, కొడుకు మిధున్‌రెడ్డిని రాజంపేట ఎంపీగా గెలిపించుకున్నారు. ఈ సారి పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఆ ముగ్గురూ పోటీలో ఉంటే. ఆయన్ని బద్ద శత్రువుగా చూసే చంద్రబాబు, నల్లారి సోదరులు ఇద్దరూ బరిలో ఉండటంతో ఎన్నికలు అందరికీ వ్యక్తిగత ప్రతిష్టగా మారాయి. అదీకాక అటు హిందూపురంలో బాలకృష్ణని, ఇటు కుప్పంలో చంద్రబాబుని ఓడించే బాధ్యతల్ని పెద్దిరెడ్డి భుజాలపై పెట్టారు జగన్.. దానికి తగ్గట్లే పెద్దిరెడ్డి తాను పోటీ చేస్తున్న పుంగనూరు కంటే కుప్పం, హిందూపురం సెగ్మెంట్లకే ఎక్కువ టైం కేటాయించారు.

జిల్లా రాజకీయాలను శాసిస్తున్న పెద్దిరెడ్డిని సొంత సెగ్మెంట్ పుంగనూరులో ఓడించడానికి ఈ సారి ఆయనకు బలమైన ప్రత్యర్థిగా చల్లా బాబును ఎంపిక చేశారు చంద్రబాబు  పెద్దిరెడ్డిని పుంగనూరు, రాజంపేట ఎంపీ స్థానాలకు కట్టడి చేసి జిల్లాలో వైసీపీని దెబ్బకొట్టడానికి ఎన్డీఏ కూటమి వ్యూహాత్మకంగా పావులు కదిపింది. కుప్పంలో చంద్రబాబును ఓడించడమే టార్గెట్‌గా అక్కడ వైసీపీ అభ్యర్ధి భరత్ విజయానికి గట్టి ప్రయత్నాలే చేశారు పెద్దిరెడ్డి  ఆ క్రమంలో ఇటీవల చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు.. తనను ఓడించడానికి పుంగనూరు పుడింగి కుప్పం వచ్చడని పెద్దిరెడ్డిని పుంగనూరులో ఓడిస్తానని సవాల్ విసిరారు చంద్రబాబు.

మరోవైపు మిత్రపక్షం బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా చంద్రబాబుకు జత కలిసారు మాజీ సీఎం కిరణ్  రాజంపేట ఎంపీగా రెండు సార్లు గెలిచిన మిధున్‌రెడ్డిని ఓడించి జిల్లాలో పెద్దిరెడ్డి పెత్తనానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. మిధున్‌ని ఓడించి పెద్దిరెడ్డి కుటుంబంపై పైచేయి సాధిస్తానన్న ధీమా కిరణ్ వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇన్నాళ్ళూ సరైన ప్రత్యర్ధి లేకపోవడంతో రెండు సార్లు తండ్రి, కొడుకులు గెలిచారని ఇప్పుడు అసలు ఆట మొదలైందని నల్లారి అనుచరులు అంటున్నారు.

బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా జిల్లాలోకి రావడం రావడమే కిరణ్‌కుమార్‌రెడ్డి రాజంపేట, పుంగనూరు,తంబల్లపల్లి లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేసిందేమీలేదని ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తులను,ప్రభుత్వ ఆదాయాన్ని లూటీ చేశారని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారని ఫైర్ అయ్యారు. ఇక వారి లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలాచిన్నదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో టీడీపీ అభ్యర్ధి చల్లా బాబుతో కలిసి ప్రచారం నిర్వహించిన కిరణ్ పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు.

పుంగనూరు టీడీపీ అభ్యర్ధి చల్లా బాబు కూడా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. ఈ సారి పెద్దిరెడ్డిపై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కిరణ్‌ని ఎంపీగా గెలిపిస్తే కేంద్రమంత్రి అవుతారని ఆయనతోనే నియోజకవర్గ అభివృద్ది సాధ్యమని ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు.

Also Read: నగరిలో గెలుపెవరిది.. రోజాకు ఓటమి తప్పదా..?

అదలా ఉంటే పెద్దిరెడ్డి ప్రాబల్యం తట్టుకోలేక చిత్తూరు జిల్లాలో చాలాకాలంగా సైలెంట్ అయిన పలువురు రెడ్డి వర్గం నేతలు నల్లారికి సహకరించారంటున్నారు. తన ప్రధాన ప్రత్యర్ధులు చంద్రబాబు, కిరణ్‌ల కాంబినేషన్‌, సొంత కులంలో వస్తున్న వ్యతిరేకతతో అలెర్ట్ అయిన పెద్దిరెడ్డి సిఎం జగన్ ను అప్పట్లో జైల్లో పెట్టించింది కిరణ్‌కూమార్‌రెడ్డే అని ప్రచారం చేశారు. రెడ్లు జారిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ జైలు సెంటిమెంట్ పండించారంట. ఇక మిధున్ రెడ్డి సైతం ఒకాయన సూట్‌కేస్‌తో ఎంపీగా పోటీ చేయడానికి వచ్చారంటూ కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. తనకు బాబు,కిరణ్ ఇద్దరు శతృవులే అని జూన్‌ నాలుగు తర్వాత మళ్లీ అదే సూటుకేసుతో కిరణ్‌ని హైదరాబాద్ పంపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

మొత్తానికి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు వర్సెస్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ అన్నట్లు సాగింది చిత్తూరు జిల్లా ఎన్నికల సమరం .. పుంగనూరులో పోల్ మేనేజ్‌మెంట్ ఈ సారి కీలకంగా మారింది.. గత మూడు సార్లుగా 83 శాతానికి పైగా పోలింగ్ జరిగిన పుంగనూరులో పెద్దిరెడ్డి 30, 40 వేల భారీ మెజార్టీలతోనే గెలుస్తూ వచ్చారు. ఈ సారి అక్కడ 86.62 పోలింగ్ శాతం నమోదైంది .. అయితే బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్న చల్లా బాబు ఈ సారి పెద్దిరెడ్డికి ప్రత్యర్ధిగా నిలిచారు. నియోజకవర్గంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న బాబు  స్థానికంగా ఉన్న పరిచయాలతో కీలక ప్రాంతాల్లో పక్క వ్యూహంతో పోల్ మేనేజ్‌మెంట్ చేశారంటున్నారు.

పెద్దిరెడ్డి పుంగనూరుకు అంత టైం కేటాయించలేకపోవడం.. ఆయనపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత వంటీ వన్నీ ఈ సారి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ క్రమంలో జిల్లాలో పెద్దిరెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని మిత్రపక్షాలు శ్రేణులు అంటుంటే.. సీఎంలుగా ఉన్నప్పుడే ఎమీ చేయాలేకపోయారు. ఇక ఇప్పుడేం చేస్తారని పెద్దరెడ్డి వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు. మరి చూడాలి ఈ చిరకాల ప్రత్యర్ధుల్లో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News