AP Assembly Sessions 2024: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఎన్నికలకు ముందు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు కావడంతో పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు అస్త్ర శస్త్రాలతో సిద్ధమయ్యాయి.
ఈరోజు ఉదయం 10 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీ జరగనుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో.. కనీసం వారంరోజులైనా చర్చలు జరపాలని భావిస్తున్నారు. సభలో చర్చించాల్సిన అంశాలపై కూడా ఈ భేటీలో నిర్ణయిస్తారు.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సమావేశాలు మూడు రోజులు మాత్రమే జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. రేవు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టేలా ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది.
ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని 10 ప్రజా సమస్యలపై నిలదీసేందుకు టీడీపీ సిద్ధమైనట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలని పట్టుబట్టాలని టీడీపీ భావిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సన్నద్ధం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిన్న తన నివాసంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. సభా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. జగన్ ఎన్నికల హామీల పేరుతో మోసాలకు పాల్పడ్డారంటూ ‘ప్రజాకోర్టు’ పేరుతో ఛార్జ్ షీట్ విడుదల చేశారు.
సీఎం జగన్ చెబుతున్న 99 శాతం హామీల అమలు అనేది అతి పెద్ద బూటకం అని విమర్శించారు. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్ కు ప్రజాకోర్టులో శిక్ష పడటం ఖాయమన్నారు. అతిపెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని చంద్రబాబు విమర్శించారు.