Egg: దారుణమైన ఘటన ఇది. అసలే పేద కుటుంబం. తల్లిదండ్రులకు చదువు రాదు. కనీసం తమ బిడ్డ అయినా చదువుకుంటే బాగుంటుందని సమీపంలోని అంగన్ వాడీ కేంద్రంలో చేర్పించారు. కానీ.. చదువుకునే చోటే ప్రాణాలు తీస్తారని ఆ పేరెంట్స్ ఊహించలేకపోయారు. స్కూల్లో పెట్టిన గుడ్డు తిని ఆ చిన్నారి చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. కుళ్లిన గుడ్డు పెట్టడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు విడిచిందని ఆ పేద కుటుంబం విలపించింది. వారి రోదన మానవ హక్కుల సంఘానికి చేరింది. 8 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కానీ, ప్రభుత్వ సిబ్బంది హైకోర్టుకు వెళ్లారు. విచారించిన ఏపీ హైకోర్టు సర్కారుకే మొట్టికాయలు వేసింది. ఇలాంటి ఘటనలో కోర్టుకు వస్తారా? సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటారుగా.. అది ఇదేనా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
గుడ్డు తిని చిన్నారి మృతి చెందిన కేసులో బాధిత కుటుంబానికి 8 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి అంగన్వాడీ కేంద్రంలో గుడ్డు తిని చిన్నారి మృతి చెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన మానవ హక్కుల సంఘం బాధిత కుటుంబానికి 8 లక్షల పరిహారం ఇవ్వాలని అంగన్వాడీ టీచర్, అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాలపై అధికారులు హైకోర్టుకు వెళ్లడంతో మానవహక్కుల సంఘం నిర్ణయం సరైనదేనని సమర్థించింది. చిన్నారి మరణం మానవ తప్పిదంగానే ధర్మాసనం అభిప్రాయపడింది.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి అంగన్వాడీ కేంద్రంలో 2022 ఫిబ్రవరిలో కోడిగుడ్డు తిని అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్న ఓ చిన్నారి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే కన్నుమూసింది. కుళ్లిన కోడిగుడ్డు పెట్టడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని పాప తల్లిదండ్రులు ఆరోపించారు. అంగన్వాడీ టీచర్ను వివరణ కోరగా తాము సరఫరా చేసిన గుడ్లు బాగానే ఉన్నాయన్నారు.
ఈ ఘటన గురించి పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హెచ్ఆర్సీ విచారణ జరిపింది. చిన్నారి తల్లిదండ్రులు సరిత, మురేగేష్లకు 8 లక్షల పరిహారం చెల్లించాలని ఈ ఏడాది జనవరి 31న తీర్పు ఇచ్చింది. ఆ సొమ్మును చెల్లించాలని అంగన్వాడీ టీచర్, కుప్పం తహసీల్దార్, శిశుసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్ తదితరులను ఆదేశించింది. మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై అధికారులు హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు పరిహారం విధించడం సరైనదే అని పిటిషన్ను కొట్టివేసింది. మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతోనే తమకు న్యాయం జరిగిందని చెబుతున్నారు ఆ చిన్నారి తల్లిదండ్రులు.