Covid: దేశంలో కరోనాపై హైఅలర్ట్ ప్రకటించింది కేంద్రం. భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసులతో కేంద్రం అప్రమత్తం అయింది. ఆ మేరకు రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. సోమవారం రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఏప్రిల్ 10, 11న కరోనా సన్నద్దతపై కేంద్రం మాక్ డ్రిల్ చేపట్టనుంది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒక్క రోజులో లక్ష మందికిపైగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1590 కొత్త కేసులు బయటపడ్డాయి. గడిచిన 146 రోజుల్లో ఇవాళే అత్యధిక కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 8వేల601 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5 లక్షలా 30 వేల 824కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఎక్స్బీబీ1.16 కరోనా కొత్త వేరియంట్ తో ఈ నెల 20 వరకు మహారాష్ట్రలో 104 కేసులు, కర్ణాటకలో 57, గుజరాత్లో 54, ఢిల్లీలో 19, పుదుచ్చేరిలో 7, హరియాణాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 3 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు 93 నమోదయ్యాయి.
గడిచిన పది రోజుల్లో దేశంలో ఏడు రోజుల రోజువారీ సగటు కేసులు రెట్టింపయ్యాయి. మార్చి 10 నాటికి సగటున 353 కేసులు నమోదుకాగా.. మార్చి 18 నాటికి 704కి చేరాయి. అలాగే, యాక్టివ్ కేసులు ముందు వారం 3వేల 778 ఉండగా.. గడచిన వారం 6వేలు దాటాయి. అయితే, దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు మాత్రం చాలా తక్కువగానే ఉంది. వారం రోజుల సగటు క్రమంగా పెరుగుతూ 0.8 శాతానికి చేరింది.
ఈ కేసులు పెరగడానికి XBB 1.16 వేరియంట్ను వైద్యులు గుర్తించారు. దేశంలో కొవిడ్ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణంగా భావిస్తున్నారు. అయితే XBB 1.16 వేరియంట్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఓ వైపు XBB 1.16 వేరియంట్ కేసులు.. మరో వైపు హెచ్3ఎన్2 వైరస్ కేసులతో దేశంలో పరిస్థితి క్లిష్టంగా మారింది.
ప్రజలు ఇప్పటికే ఇన్ ఫ్లొయేంజా బారిన పడి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల రోగనిరోధక శక్తి తగ్గి కోవిడ్ సమస్యను మరింత తీవ్రతరం చేసే అవకాశాలు నిపుణులు చెబుతున్నారు. XBB 1.16 వేరియంట్, ఇన్ ఫ్లూయెంజా కేసుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.