Congress Puri Lok Sabha Candidate Drops: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసింది మోదీ సర్కార్. ఎన్నికల ముందు ఇలా చేయడం కరెక్ట్ కాదని ఖర్గే, రాహుల్ వంటి నేతలు ధ్వజమెత్తారు. తమకు నిధుల సమస్య వెంటాడుతుందని పదేపదే చెప్పుకొచ్చారు. ఆ విషయం ఎంతవరకు వచ్చిందనేది పక్కన బెడితే.. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.
ఒడిషాలోని పూరి నుంచి కాంగ్రెస్ తరపున లోక్సభ అభ్యర్థిగా దిగిన సుచరిత మహంతి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. పార్టీ నుంచి తనకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదన్నది ఆమె చెబుతున్నమాట. పార్టీ నిధులు లేకుండా ప్రచారం చేయడం తనకు సాధ్యంకాలేని మనసులోని మాట బయటపెట్టారు. ఈ క్రమంలో తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు సుచరిత ఈ మెయిల్ పంపారు.
నిధులు లేని కారణంగా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ విషయాన్ని ఒడిషా యూనిట్ తెలిపానని ప్రస్తావించారు సుచరిత మహంతి. అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. తాను సొంతంగా నిధులు సమకూర్చలేని పరిస్థితిలో ఉన్నానని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి అవసరమైన నిధులను సమకూర్చాలని పార్టీ హైకమాండ్ను అభ్యర్థించినట్టు చెప్పుకొచ్చారు.
Also Read: తుపాకీతో బెదిరించి కామవాంఛ తీర్చుకున్నాడు.. రేవణ్ణపై జేడీఎస్ కార్యకర్త ఫిర్యాదు..
పూరీ లోక్సభ స్థానానికి ఆరో విడత అంటే మే 25న పోలింగ్ జరగనుంది. నామినేషన్ సమర్పణ మే ఆరు ఆఖరు తేది. సుచరిత ఇప్పటివరకు నామినేషన్ దాఖలు చేయలేదు. బీజేపీ తరపున సాంబిత్ పాత్రా, బిజూ జనతాదల్ నుంచి అరూప్ పట్నాయక్ నామినేషన్లను దాఖలు చేశారు.
ఒక్కసారి వెనక్కి వెళ్తే.. గుజరాత్లోని సూరత్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించు కోవడంతో అక్కడ బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కూడా వివిధ సమస్యల కారణంగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి డ్రాపయ్యారు. ఈసారి ఒడిషా వంతైంది.