Vijayawada East Politics Devineni Avinash Vs Gadde Rammohan: ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఆ సీటును ఏ పార్టీ కైవసం చేసుకోనుందోననే అంశం.. ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. తమ కంచుకోటను కాపాడుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉంటే.. సీటు దక్కించుకునేందుకు వైసీపీ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. అధికారపార్టీ తరుపున దేవినేని అవినాష్ బరిలో ఉండగా.. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికై మరోసారి విన్ అయ్యేందుకు రామ్మోహన్ పోటీ పడుతున్నారు. ఇద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందోననే ఇష్యూ ఉత్కంఠగా మారింది.
ఏపీలో రాజకీయాల్లో ఆసక్తి కలిగించే నియోజకవర్గాల్లో విజయవాడ తూర్పు ఒకటి. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన గద్దె రామ్మోహన్రావు మూడోసారి విజయం కోసం పట్టుదలతో ప్రచారాన్ని సాగిస్తున్నారు. NDA కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రామ్మోహన్… సూపర్ సిక్స్ పథకాలను ఓటర్లకు తెలియచేస్తూ జనసేన ఓటర్లు, బీజేపీ సపోర్ట్తో గెలవాలనే ఆలోచనలో ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు, ముఖ్యనేతలతో పాటు భార్య అనురాధతో కలసి నియోజకవర్గ వ్యాప్తంగా ముమ్మరంగా పర్యటనలు చేస్తున్నారు.
మరోవైపు.. టీడీపీ ఆశలపై నీళ్లు చల్లేందుకు వైసీపీ గట్టి అభ్యర్థినే బరిలోకి దించింది. దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడుగా వచ్చిన యువనేత దేవినేని అవినాష్.. గద్దెను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. గతంలో టీడీపీలో ఉన్న అవినాష్.. గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తర్వాత కాలంలో అవినాష్ వైసీపీలో చేరారు. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే కావాలనే ధృడ నిశ్చయంతో దూసుకుపోతున్నారు. తన కుటుంబానికి ఉన్న ఇమేజ్తో పాటు జగన్ చేస్తున్న పాలనను ప్రజలకు వివరిస్తూ గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకోవడానికి విజయవాడ నగరంలోని తూర్పు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అందులో టీడీపీ కంచుకోటలో పాగా వేసేందుకు అవినాష్ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఓ వైపు సొంత ఇమేజ్తో గెలుపు అవకాశాలను చూసుకుంటూనే ప్రభుత్వ అభివృద్ధితో గెలుపు ఖాయం చేసుకునే విధంగా పక్కా ప్రణాళికతో అవినాష్ ప్రచారం చేసుకుంటున్నారు.
ఇద్దరి బలాబలాలను పరిశీలిస్తే… గద్దె రామ్మోహన్తో పోల్చితో దేవినేని అవినాష్కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇది.. వైసీపీ విజయానికి ఉపయోగపడే అవకాశంగా తెలుస్తోంది. తండ్రి నెహ్రూ ఉన్నప్పటి నుంచి అభినాష్..యువతతో మమేకమవుతూ మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. ఫాలోయింగ్తో పాటు తన నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. కృష్ణలంక ప్రాంతంలో రిటర్నింగ్ వాల్ పనులు.. అవినాష్ విజయానికి దోహదం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు కల్పించడంతో అవినాష్ గెలుపునకు అవే బాటలు వేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
Also Read: బీజేపీకి ముస్లింల సపోర్ట్.. వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ!
ఓవైపు.. మాస్ ఇమేజ్కు తోడు వైసీపీ సర్కారు చేసిన అభివృద్ధి తోడు అవటంతో విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని సర్వేలు కూడా చెబుతున్నాయట. దీంతో అవినాష్.. మరింత ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. రెండుసార్లు ఎమ్మెల్యే అయిన గద్దె రామ్మోహన్రావుపై గెలుపు అంత సులువు కాదనే వాదనలూ ఉన్నాయి. 2024లో తూర్పు నియోజకవర్గం పీఠం ఎవరికి దక్కబోతుందో మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.