YS Sharmila Comments on YSRCP Guarantee’s: ఏపీ సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ఐదేళ్లు వైసీపీ నేతలంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. కడప అభివృద్ధిని మరిచి అక్రమార్జనపై ఫోకస్ పెట్టారని మండిపడ్డారు. జిల్లా ప్రజల అవసరాలను తీర్చని వైసీపీ నేతలకు ఎందుకు ఓటేయాలో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.
ఏపీ సీఎం జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. కడపలో జరిగిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. అంజద్ బాషా, మల్లికార్జున్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు అందరూ దోపిడీ దారులని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేక పోగా కనీసం రాజధాని కూడా లేదని అన్నారు. ఏపీ వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతుందని ఆరోపించారు. న్యాయం కోసం వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మ ఘోషిస్తోందని అన్నారు. చట్టసభలకు నిందితులు రావొద్దనే.. కడప నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. కడప ఎంపీగా రాజశేఖర్ రెడ్డి కూతురు కావాలో.. వివేకాను హత్య చేయించిన అవినాష్ రెడ్డి కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇదిలా ఉంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగి వైఎస్ఆర్ పేరు సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్పించారని షర్మిల ఆరోపించారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. సీఎం జగన్ కు సంబంధించిన కేసుల్లో మొదట తన తండ్రి పేరు లేదని తెలిపారు. కానీ కుట్ర పూరితంగా ఆయన పేరు చేర్చారని అన్నారు. సోనియా గాంధీ ఈ విషయాన్ని తనతో చెప్పారని వెల్లడించారు.
Also Read: చంద్రబాబుకు ఓటు వేస్తే.. కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే: జగన్
కేసుల నుంచి సీఎం జగన్ బయటపడేందుకే ఛార్జ్ షీట్ లో వైఎస్సార్ పేరు ఉండేలా చేశారని ఆరోపించారు. తన తండ్రి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్పించిన వ్యక్తికి జగన్ ఏఏజీ పదవి ఇచ్చారంటే ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. వివేకానంద హత్య జరిగినప్పుడు కూడా సీబీఐ విచారణ జరిపించాలన్న జగన్ తర్వాత మాట మార్చారని ఆరోపించారు.