Bandi Sanjay: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై కమలనాథులు పోరు ఉధృతం చేశారు. హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ దగ్గర మహా ధర్నా చేపట్టారు. నిరుద్యోగులకు బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మెడలు వంచే వరకూ వదిలే ప్రసక్తే లేదని అన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహించి మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని.. కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
పేపర్ లీక్లో ఇద్దరి ప్రమేయమే ఉందని కేటీఆర్ చెప్పారని.. ఇద్దరే ఉన్నప్పుడు ఇతరులను ఎలా అరెస్టు చేశారో ఆయనే చెప్పాలంటూ బండి ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు నిరాశకు గురికావొద్దని.. బీజేపీ అధికారంలోకి వస్తుందని.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుందని అన్నారు.
పరీక్షలు రాసి నష్టపోయిన యువతకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష భృతి ఇవ్వాల్సిందేనన్నారు బండి సంజయ్. అన్ని యూనివర్సిటీలు తిరిగి విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. ఏప్రిల్ 2 నుంచి 6 వరకు 10 ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గడీలు బద్దలయ్యే విధంగా రాష్ట్రంలో నిరుద్యోగ మార్చ్ను చేపడతామని బండి సంజయ్ ప్రకటించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై మాట్లాడితే తాను ఇంట్లో లేని సమయం చూసి సిట్ వాళ్లు తన ఇంటికి వచ్చి నోటీసులు అంటించారని బండి సంజయ్ అన్నారు. సిట్ అధికారులను తానే పిలిచి నోటీసులు అందుకున్నానని చెప్పారు. ఈ కేసులో దొంగలను వదిలిపెట్టి ప్రతిపక్ష నేతలకు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే ధైర్యం సిట్కు లేదని విమర్శించారు. లీకేజీ కేసులో పెద్దపెద్ద వాళ్లను వదిలేసి చిన్నవాళ్లను అరెస్టు చేశారని మండిపడ్డారు. రశ్నపత్రాలు లీక్ అవ్వటం సర్వసాధారణమే అన్న బీఆర్ఎస్ మంత్రికి నోటీసు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. టీఎస్పీఎస్సీలోని అసలు దొంగలను పట్టుకోవాలని.. నిందితులను శిక్షంచకపోతే తెలంగాణ ప్రభుత్వానికి భయమంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు బండి సంజయ్.
మరోవైపు, బీజేపీ మహా దీక్షకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. TSPSCలో ఇంటి దొంగలను పట్టుకుంది తామేనని.. బీజేపీ నేతలు ఎన్ని దీక్షలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.