Vemireddy Prabhakar Reddy resigns to YCP(AP news live): వైసీపీకి పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి నెల్లూరు ఒకటి. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం అన్ని ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది. కానీ 2024 ఎన్నికల ముందు జిల్లాలో ఎన్నడూ లేని పరిస్థితులను వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసీపీకి తొలి షాక్ తగిలింది. కచ్చితంగా గెలవాల్సిన ఓ ఎమ్మెల్సీ స్థానంలో ఓడిపోయింది. ఉమ్మడి
నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విప్ ను ధిక్కరించి టీడీపీ అభ్యర్థికి ఓటేశారని వైసీపీ అధిష్టానమే ఆరోపించింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇలా ముగ్గురు బలమైన నేతలు పార్టీకి దూరమయ్యారు. ఆ ముగ్గురు నేతలు టీడీపీలో చేరిపోయారు.
ఇక ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. తన మనసులోని మాటను బహిరంగంగానే బయటపెట్టారు. కానీ వైసీపీ అధిష్టానం నుంచి ఆయనకు ఎంపీ సీటుపై భరోసా రాలేదు. సీఎం వైఎస్ జగన్ ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని వేమిరెడ్డి సన్నిహితులు చెబుతున్న మాట.
Read More: ఇక విచారణ లేదు.. డైరక్ట్ యాక్షన్..
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారు. బహిరంగంగానే ఈ విషయాలను ఆయన ప్రస్తావించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పు సమయంలోనూ తనతో సంప్రదించలేదనే అసంతృత్తి వేమిరెడ్డిలో ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. పేరుకే వైఎస్ఆర్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్ తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడంలేదని సన్నిహితుల వద్ద వేమిరెడ్డి వాపోయారని అంటున్నారు.
నెల్లూరు నగర సమన్వయకర్త బాధ్యతలు ఎండీ ఖలీల్ కు అప్పగించిన సమయంలోనూ తనకు ఆ విషయం చెప్పలేదని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనస్థాపం చెందారని తెలుస్తోంది. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పారు వేమిరెడ్డి.
పార్టీని వీడకుండా ఉండేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో వైసీపీ పెద్దలు చర్చలు జరిపారు. కానీ ఆయన పార్టీని వీడాలనే నిర్ణయించారు. తన నిర్ణయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. వైసీపీ సభ్యుత్వానికి, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ లేఖను సీఎం వైఎస్ జగన్ పంపారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.