Aviation Sector: ఇండియాలో ఫ్యూచర్ డిమాండ్ ఉన్న సెక్టార్ ఏది? పౌర విమానయాన రంగానికి మాంచి డిమాండ్ ఉందా? ఇంకా 30 వేల మంది పైలట్లు అవసరమా? 1700 విమానాల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయా? దేశంలో వందల సంఖ్యలో విమానాలు తిరుగుతున్నాయా? అవుననే అంటున్నారు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో విమానయాన రంగానికి చెందిన కీలక విషయాలు బయటపెట్టారు.
ఫ్యూచర్ విమానయాన రంగానిదే
విశాఖ వేదికగా రెండురోజులపాటు జరిగిన CII భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఒక సెషన్లో మాట్లాడారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. అమెరికాలో ప్రత్యేక విమానాశ్రయాన్ని కలిగి ఉన్న గ్లోబల్ లాజిస్టిక్స్ కంపెనీ ఫెడెక్స్ తరహాలో, కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో కార్గో విమానాశ్రయాలను ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తోందన్నారు. భారత విమానయాన సంస్థల నుండి 1,700 విమానాల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
అవి ఇండియాకు రాగానే అదనంగా 30 వేల మంది పైలట్లు అవసరమవుతారని అన్నారు. దేశంలో ప్రస్తుతం 834 విమానాలు ఉన్నాయని, దాదాపు 8 వేల మంది పైలట్లు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వారిలో 2 నుండి 3 వేల మంది పైలట్లు చురుకుగా విమానాలు నడపలేదన్నారు. భారత ఎయిర్లైన్స్ సంస్థలు ఇప్పటికే బోయింగ్, ఎయిర్బస్ వంటి తయారీ దారులతో 1,700 విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయని గుర్తు చేశారు.
30 వేల మంది పైలట్లు అవసరం
సరైన షెడ్యూల్ ప్రకారం ఓ విమానం నడపడానికి కనీసం 10 నుండి 15 మంది పైలట్లు అవసరం అన్నారు. వారి సంఖ్యను బట్టి షెడ్యూల్ మార్గాలను చేయగలరన్నారు. ఈ లెక్కన 1700 విమానాలకు దాదాపు 25 వేల నుండి 30 వేల మంది పైలట్లు అవసరమన్నారు. ఈ డిమాండ్ను తీర్చడానికి మరిన్ని ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు-FTO లు ఉండాలన్నారు.
ఎందుకంటే ఇప్పటికి ఉన్నవి పరిమిత సంఖ్యలో పైలెట్లను తయారు చేస్తున్నారని గుర్తు చేశారు. విమానయాన రంగంలో ఒక ఉద్యోగం 15 పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుం దన్నారు. దేశంలో IATA సంఖ్య 6 గా ఉందన్నారు. శిక్షణ, నైపుణ్య వంతులను తయారు చేయడం దేశంలో చాలా ముఖ్యమైన విషయమన్నారు.
ALSO READ: మారుతి సుజుకి కార్లు వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్
విమానయాన కార్గో రంగం.. రైలు-రోడ్డు రవాణా నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోం దన్నారు. ఇవి చౌకైనవిగా చెప్పారు. ఎయిర్లైన్స్ ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగు పరచడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో 2 బిలియన్ డాలర్లు విలువైన ఏరోస్పేస్ భాగాలను తయారు చేస్తున్నారు. 2030 నాటికి ఆ సంఖ్య 4 బిలియన్ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యం ఉందని, ట్రాక్లో ఉందన్నారు.
దేశంలోనే పూర్తి స్థాయి విమానాన్ని రూపొందించాలనే దీర్ఘకాలిక లక్ష్యాన్ని కేంద్రం కలిగి ఉందన్నారు. దేశంలో సగటున ప్రతిరోజూ 4.8 లక్షల మంది విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు. నవంబర్ 10న 5.3 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారని, ఇదొక విజయమన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు.