Mutual Funds: టీవీలో ఏదైనా మ్యూచువల్ ఫండ్ యాడ్ రాగానే.. చివర్లో ఒక వ్యక్తి శరవేగంతో ఒక డైలాగ్ చెప్పడం మనమంతా వినే ఉంటాం. ‘Mutual Fund Investments are Subject to Market Risks..’ అంటూ రైలు పరిగెత్తినట్లు చదివే ఆ హెచ్చరిక వెనుక చాలా పెద్ద కథే ఉంది. మొదట్లో అస్సలు అర్థం కానంత స్పీడ్గా చదివిన ఈ డైలాగ్.. ఇప్పుడు కాస్త నెమ్మదించింది. అసలు అంత స్పీడ్గా కూడిన అలర్ట్ వెనుక ఉన్న రహస్యం ఏంటో? ఈ ప్రకటనల అసలు ఉద్దేశం ఏంటో.. ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఆ హెచ్చరికను అంత వేగంగా చదవడానికి ప్రధాన కారణం సమయం, డబ్బు. టీవీ లేదా రేడియో ఛానళ్లలో ప్రకటనల కోసం ప్రతి సెకనుకు రూ.లక్ష ఖర్చవుతుంది. సాధారణంగా ఒక కమర్షియల్ యాడ్ కేవలం 20 లేదా 30 సెకన్లు మాత్రమే ఉంటుంది. అందులో 25 సెకన్ల పాటు బ్రాండ్ ప్రమోషన్ లేదా సెలబ్రిటీల డైలాగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక మిగిలిన 2 నుంచి 3 సెకన్లలోనే ఈ చట్టపరమైన హెచ్చరికను ముగించాల్సి రావడం వల్లనే ఆ రేంజ్ స్పీడ్ కనిపిస్తుంది.
ఏ కంపెనీ అయినా తమ ప్రొడక్ట్ గురించి కేవలం పాజిటివ్ విషయాలే చెప్పాలని ఆశిస్తుంది. ఒకవేళ యాడ్ చివర్లో ‘ఇందులో రిస్క్ ఉంది, మీ డబ్బులు పోయే అవకాశం ఉంది’ అని నిదానంగా, స్పష్టంగా చెప్తే.. చూసే ప్రేక్షకుడికి భయం కలిగి ఇన్వెస్ట్ చేయకపోవచ్చు. అందుకే నియమ నిబంధనలు పాటించామని అనిపించుకుంటూనే.. అటు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకు ఆ హెచ్చరికను వీలైనంత వేగంగా ముగించే సైకాలజీని వాడతారు.
Also Read: వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!
ఈ వేగవంతమైన హెచ్చరికలపై ప్రజల్లో జోకులు పేలడమే కాకుండా.. సుప్రీం కోర్ట్ కూడా సీరియస్ అయింది. దీంతో దేశీయ మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెబీ (SEBI) కొన్ని కీలక నిబంధనలు మార్చింది. యాడ్ చివర్లో ఈ హెచ్చరికను మరీ ఫాస్ట్గా కాకుండా, కనీసం 5 సెకన్ల పాటు స్క్రీన్ మీద ఉంచాలని, స్పష్టంగా చదవాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు హెచ్చరికతో రూటు మార్చినప్పటికీ.. పాత అలవాటు ప్రకారం ఇప్పటికీ అది మిగతా యాడ్తో పోలిస్తే కాస్త స్పీడ్గానే అనిపిస్తుంది.
మొదట్లో చాలామంది రోహిత్ శర్మ వంటి క్రికెటర్ల ప్రకటనలు చూసి ఇది నిర్దిష్టంగా SBI లేదా HDFC లాంటి ఏదో ఒక కంపెనీకి సంబంధించినవి అనుకునేవారు. కానీ ఈ క్యాంపెయిన్ నడుపుతోంది అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI). సెబీ మార్గదర్శకాల ప్రకారం.. సాధారణ ప్రజల్లో పెట్టుబడులపై సరైన అవగాహన కల్పించడానికి, మార్కెట్ భయాలను పోగొట్టడానికి ఈ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు.
సాధారణంగా ప్రజల్లో షేర్ మార్కెట్ అంటే కేవలం రిస్క్ అనే ఒక అపోహ ఉంటుంది. వాటిని పోగొట్టడానికే క్రికెటర్లను రంగంలోకి దించారు. మ్యాచ్ గెలవడానికి క్రమశిక్షణ, నెమ్మదిగా పార్టనర్షిప్ నిర్మించడం ఎంత ముఖ్యమో చెప్తూ.. మ్యూచువల్ ఫండ్స్లో కూడా క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. చివరకు వినియోగదారులను ఆకర్షించడానికి ఇదంతా ఒక పెద్ద వ్యాపార వ్యూహమే అని చెప్పక తప్పడం లేదు.
Also Read: ఐఫోన్, శాంసంగ్లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!