Kolkata-London Bus Service: ఈ రోజుల్లో విదేశాలకు వెళ్లాలంటే విమానాలు ఉన్నాయి. కానీ, ఒకప్పుడు భారతదేశం నుంచి ఇంగ్లాండ్ వరకు బస్సులో ప్రయాణించే వారంటే ఆశ్చర్యం కలగకమానదు. 1957 నుంచి 1976 వరకు కోల్కతా–లండన్ మధ్య ప్రత్యేక బస్సు సర్వీస్ నడిచేది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బస్సు మార్గాల్లో ఇదీ ఒకటిగా గుర్తింపు పొందింది.
ఈ బస్సు ప్రయాణం దాదాపు 16,000 కిలోమీటర్ల దూరం సాగేది. మార్గమధ్యంలో దాదాపు డజనుకు పైగా దేశాలు దాటుతూ చివరకు లండన్ చేరేది. మొత్తం ప్రయాణం పూర్తి కావడానికి సుమారు 50 రోజులు పట్టేది. ఆ కాలంలో ఇది ఒక సాహస యాత్రగా భావించేవారు. ఈ ప్రత్యేక బస్సు సర్వీసును ఐర్లాండ్కు చెందిన మాజీ రాయల్ ఎయిర్ ఫోర్స్ అధికారి ప్యాడీ గారో ఫిషర్ ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన తొలి బస్సుకు ‘ది ఇండియామాన్’ అనే పేరు పెట్టారు. ఈ బస్సు లండన్ నుంచి 20 మంది ప్రయాణికులతో బయలుదేరి విజయవంతంగా కోల్ కతా చేరుకుంది. ఆ తర్వాత ఈ సర్వీస్ కు మంచి ఆదరణ లభించింది.
50 రోజుల ప్రయాణం కావడంతో బస్సును ప్రత్యేకంగా రూపొందించారు. అందులో పడుకునేందుకు బంక్ బెడ్లు, భోజనం తయారు చేసుకునే చిన్న వంటగది, భోజనశాల లాంటి సౌకర్యాలు ఉండేవి. దీంతో ప్రయాణికులు సుదీర్ఘ ప్రయాణంలో కూడా సౌకర్యవంతంగా గడిపే అవకాశం కలిగేది.
ఈ బస్సు ప్రారంభమైన సమయంలో టికెట్ ధర సుమారు 85 పౌండ్లు( సుమారు రూ. 9,945) ఉండేది. తరువాత డిమాండ్ పెరగడంతో 1973 నాటికి ధర 145 పౌండ్ల (సుమారు రూ. 16,965)కు చేరుకుంది. అయినప్పటికీ విదేశీ ప్రయాణం చేయాలనుకునే చాలా మంది ఈ బస్సు ప్రయాణం పట్ల ఆసక్తి చూపించేవారు.
1960 చివరి నాటికి ఈ మార్గం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒక్క కంపెనీ మాత్రమే కాకుండా 30కి పైగా సంస్థలు ఇలాంటి సుదూర బస్సు సర్వీసులను నడుపాయి. యూరప్ నుంచి ఆసియా వరకు భూభాగం మీదుగా ప్రయాణించడం అప్పట్లో ఎంతో ప్రత్యేకమైన ఎక్స్ పీరియెన్స్ గా ఉండేది.
1970 చివర్లో మిడిల్ ఈస్ట్ లో, ఆసియాలో రాజకీయ పరిస్థితులు మారాయి. కొన్ని దేశాల్లో ఉద్రిక్తతలు, భద్రతా సమస్యలు పెరగడంతో ఈ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది. దీంతో కోల్ కతా–లండన్ బస్సు సర్వీస్ లను నిలిపివేశారు.
ఇప్పుడు లండన్కు చేరుకోవడానికి విమానంలో కొన్ని గంటలే పడుతున్నా, ఒకప్పుడు 50 రోజుల పాటు బస్సులో ప్రయాణిస్తూ దేశాలు దాటడం ఓ అరుదైన అనుభవంగా చెప్పుకోవచ్చు. కోల్కతా–లండన్ బస్సు సర్వీస్ రవాణా చరిత్రలో ఒక అద్భుత అధ్యాయంగా ఇప్పటికీ గుర్తుండిపోయింది.
Read Also: ‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?