Blue Sky: నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునేవరకూ మనిషి కంటికి కనిపించే అద్భుతమైన, ఆహ్లాదరకరమైన దృశ్యం.. ఆకాశం. అయితే నింగి చూడటానికి ఎప్పుడూ నీలంగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆ రంగు ఎలా వచ్చిందన్న దానిపై చాలామందిలో రకరకలా అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు సూర్యుడు, నక్షత్రాలు దగదగా మెరుస్తున్నప్పటికీ అంతరిక్షం చీకటిగా, నల్లగా ఎందుకు ఉందన్న ప్రశ్న కూడా చాలా మందిని వేధిస్తుంటుంది. అయితే ఇదంతా సూర్యకాంతి ప్రయాణించే తీరు, భూ వాతావరణాన్ని తాకినప్పుడు అది ప్రవర్తించే విధానం పైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. నింగి నీలంలోనే ఎందుకు? అంతరిక్షం నల్లగా ఉండాల్సిందేనా? వంటి ప్రశ్నలకు ఈ కథనంలో సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం.
మన కంటికి తెల్లగా కనిపించే సూర్యకాంతి నిజానికి ఏడు వేర్వేరు రంగుల సమాహారం. ఎరుపు, నారింజ, పసుపు, పచ్చ, నీలం, ఇండీగో, ఊదా (VIBGYOR) రంగులతో కూడి ఉంటుంది. దీనినే వాడుక భాషలో ఇంద్రధనుస్సు అంటారు. వర్షం పడిన సందర్భాల్లో ఈ రంగులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అయితే ఇంద్రధనుస్సులోని ప్రతీ రంగు ఒక ప్రత్యేకమైన తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది. ఎరుపు రంగు తరంగాలు పొడవుగా ఉంటే, నీలం రంగు తరంగాలు చాలా చిన్నవిగా ఉంటాయి.
సూర్యూడి నుంచి వచ్చే కిరణాలు భూవాతావరణంలోకి ప్రవేశించగానే గాలిలోని నైట్రోజన్, ఆక్సిజన్ వంటి వాయు అణువులను అవి ఢీకొడతాయి. ఈ క్రమంలో నీలం రంగు కాంతి తరంగాలు చాలా చిన్నవి కావడంతో ఈ వాయు అణువుల వల్ల అవి అన్ని దిశల్లోకి సులభంగా చెదిరిపోతాయి (పరిక్షేపణం). ఇలా ఆకాశమంతటా వ్యాపించిన నీలి వెలుగే కంటిని చేరడం వల్ల ఆకాశం పగటిపూట నీలంగా కనిపిస్తుంది.
సాయంత్రం వేళ సూర్యాస్తమయం ఎర్రటి రంగులో కనిపించడానికి కూడా ఈ కాంతి పరిక్షేపణ కారణం. సూర్యుడు నడినెత్తిన కాకుండా తూర్పుకో, పడమర దిశలో వంగి ఉన్నప్పుడు సూర్యకాంతి మనల్ని చేరడానికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న నీలిరంగు కాంతి దాదాపుగా చెదరిపోయి పక్కకు వెళ్లిపోతుంది. ఫలితంగా ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు, నారింజ రంగులు మాత్రమే నేరుగా మన కంటిని చేరుతాయి. వాతావరణంలో ధూళి, పొగ వంటి కణాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూర్యాస్తమయాలు మరింత థిక్ ఎరుపు రంగులో దర్శనమిస్తాయి.
ఖగోళంలోని గ్రహాల వాతావరణాన్ని బట్టి అక్కడ వాటి ఆకాశం రంగులు మారుతుంటాయి. ఉదాహరణకు, అంగారక (మార్స్) గ్రహంపై సూక్ష్మ ధూళి కణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అక్కడ పగటిపూట ఆకాశం నారింజ లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా మార్స్ పై సూర్యాస్తమయం సమయంలో సూర్యుని చుట్టూ ఉండే ఆకాశం నీలి-బూడిద రంగులోకి మారుతుంది.
Also Read: టైటిల్ గెలవగానే తలకెక్కిన పొగరు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవరాక్షన్
సూర్యుడు నిరంతరం వెలుగుతున్నప్పటికీ అంతరిక్షం మాత్రం చీకటిగా ఎందుకు ఉంటుందన్న ప్రశ్న ఒక పజిల్ లా అందరినీ వెంటాడుతూనే ఉంటుంది. దీనికి కారణం.. అంతరిక్షంలో వాతావరణం లేకపోవడమే. అక్కడ కాంతిని చెదరగొట్టడానికి గాలి గానీ, ఎలాంటి వాయు అణువులు గానీ ఉండవు. అంతరిక్షం నుంచి సూర్యుడి వైపు చూస్తే తెలుపు రంగు వెలుగు కనిపిస్తుంది. అదే సమయంలో పక్కకు చూస్తే కాంతిని మన కంటి వైపు మళ్లించే మాధ్యమం లేదు కాబట్టి పగటి పూట కూడా అక్కడ విపరీతమైన చీకటి అలుముకొని ఉందన్న భావన కలుగుతుంది.
Also Read: గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్కడు లేకపోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది