Boss Scam Alert: కార్పొరేట్ సంస్థలను, లిస్టెడ్ కంపెనీలను టార్గెట్ చేస్తూ సాగుతున్న ‘బాస్ స్కామ్’ పట్ల మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) తీవ్రంగా స్పందించింది. కంపెనీల ఉన్నతాధికారుల పేర్లతో వస్తున్న నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రెగ్యులేటెడ్ సంస్థలను, లిస్టెడ్ కంపెనీలను హెచ్చరించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ తరహా మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయని సెబీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ‘బాస్ స్కామ్’లో కేటుగాళ్లు కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్లు (ఎండీ), ఇతర సీనియర్ అధికారుల లాగా నటిస్తారు. వాట్సాప్, ఈమెయిల్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా కంపెనీలోని ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాల సిబ్బందికి అత్యవసరంగా నిధులు బదిలీ చేయాలంటూ సందేశాలు పంపుతారు. ఆయా సంస్థల్లో పనిచేసే సబార్డినేట్లు తమ బాస్ నిజంగానే ఆదేశించారనే భ్రమలో పడి.. వెనకా ముందూ ఆలోచించకుండా మోసగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాలకు నిధులను బదిలీ చేసి మోసపోతున్నారు.
ఈ మోసాల్లో కేవలం టెక్స్ట్ మెసేజ్లకే పరిమితం కాకుండా నేరగాళ్లు అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వాడుతున్నట్లు సెబీ గుర్తించింది. కంపెనీ ఉన్నతాధికారుల గొంతును అనుకరిస్తూ ‘ఏఐ వాయిస్ క్లోనింగ్’ ద్వారా ఫోన్ కాల్స్ చేయడం, ‘డీప్ఫేక్ వీడియో కాల్స్’ చేయడం వంటివి చేస్తున్నారు. దీనివల్ల అవతలి వ్యక్తి నిజంగా తమ బాస్ లేదా సీనియర్ అధికారే మాట్లాడుతున్నారని నమ్మి సిబ్బంది సులభంగా బుట్టలో పడిపోతున్నారు.
సెబీ వివరించిన మరో పద్ధతి ప్రకారం.. మోసగాళ్లు బాధితులకు ఒక కంప్రెస్డ్ ‘జిప్ ఫైల్’ను పంపుతారు. వినియోగదారులు ఆ ఫైల్ను విండోస్ డివైజ్లలో ఓపెన్ చేయగానే అందులోని మాల్వేర్ యాక్టివ్గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్ను హ్యాక్ చేస్తుంది. తద్వారా బాధితుడి వాట్సాప్ ఖాతాను తమ ఆధీనంలోకి తెచ్చుకుని ఫైనాన్స్ టీమ్కు పేమెంట్ సూచనలు పంపుతారు. మరికొన్ని సందర్భాల్లో డివైజ్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని కాంటాక్ట్ లిస్ట్లో మార్పులు చేస్తారు. మోసగాడి నెంబరును సీఈఓ లేదా ఎండీ పేరుతో సేవ్ చేసి ఆ నెంబర్ ద్వారా అకౌంట్స్ ఆఫీసర్ను డబ్బులు పంపాల్సిందిగా ఆదేశిస్తారు.
Also Read: పోలీసులను వీడియో తీయెుచ్చా? ఫోన్ లాక్కునే హక్కు వారికి లేదా? చట్టం ఏం చెబుతోంది?
పైన పేర్కొన్న సైబర్ దాడుల నుంచి తప్పించుకోవడానికి కార్పొరేట్ ఉద్యోగులు, నిపుణులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని సెబీ సూచించింది. వాట్సాప్, ఈమెయిల్స్, సోషల్ మీడియాలో వచ్చే నిధుల బదిలీ అభ్యర్థనలను కేవలం సందేశాల ఆధారంగా నమ్మకూడదని పేర్కొంది. వెంటనే సంబంధిత సీనియర్ అధికారులకు నేరుగా ఫోన్ చేసి ఆ ఆదేశాల నిజానిజాలను సరిచూసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ వాడిన తర్వాత దానిని అలాగే వదిలేయకుండా లాగౌట్ చేయాలని హితవు పలికింది. అటు మెసేజ్ పంపిన వారి ఐడెంటిటీని ధృవీకరించుకోకుండా ఎలాంటి జిప్ ఫైల్స్, అటాచ్మెంట్లను సిస్టమ్లలో ఇన్స్టాల్ చేయవద్దని చెప్పింది.
Also Read: భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?