Patalpani–Kalakund Heritage Train: దేశంలో ఇప్పటికీ మీటర్ గేజ్ ట్రాక్ మీద నడుస్తున్న కొద్ది రైళ్లలో పాతాళ్ పాని–కలకండ్ హెరిటేజ్ రైలు ఒకటి. పశ్చిమ రైల్వే పరిధిలోని రత్లాం డివిజన్ నడుస్తున్న ఈ స్పెషల్ రైలు మధ్యప్రదేశ్ లోని వింధ్యాచల్ కొండల మధ్య సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మాత్రమే నడిచే ఈ రైలు ప్రయాణం ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రఫీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ రైలు వేగంగా కాకుండా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ప్రయాణికులు ఈ మార్గంలో కనిపించే ప్రకృతి అందాలను ఆస్వాదించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణంలోనే రైలు నాలుగు సొరంగాలు, 24 మలుపులు, ఆరు పెద్ద వంతెనలు, 35 చిన్న వంతెనలు దాటుతుంది. ప్రతి మలుపులోనూ అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తూ ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది.
ఈ ప్రయాణంలో ప్రధాన ఆకర్షణ పాతాళ్ పాని జలపాతం. దాదాపు 300 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకే ఈ జలపాతం వద్ద రైలు సుమారు 30 నుంచి 50 నిమిషాల పాటు ఆగుతుంది. ఈ సమయంలో ప్రయాణికులు రైలు దిగి జలపాతాన్ని దగ్గరగా చూసి ఫొటోలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన ప్రదేశం వ్యాలీ బ్రిడ్జ్. ఇక్కడ రైలును కొద్దిసేపు నిలిపి చోరల్ నదీ లోయ, చుట్టూ ఉన్న పచ్చని కొండల అందాలను వీక్షించే అవకాశం కల్పిస్తారు.
ఈ రైల్వే మార్గానికి ప్రత్యేక చరిత్ర ఉంది. 1870 ప్రాంతంలో నిర్మించిన హోల్కర్ స్టేట్ రైల్వే మార్గంలోని ఒక భాగంపైనే ఈ హెరిటేజ్ రైలు నడుస్తోంది. పాతాళ్ పాని స్టేషన్ కు స్వాతంత్ర్య సమరయోధుడు తాంతియా భిల్ పేరు ఉండగా, కలకుండ్ స్టేషన్ స్థానికంగా ప్రసిద్ధి చెందిన కలకండ్ అనే తీపి వంటకం కారణంగా పేరు పొందింది.
ఈ హెరిటేజ్ రైలు సాధారణంగా జూలై చివరి నుంచి ఆగస్టు వరకు వర్షాకాలంలో శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో మాత్రమే నడుస్తుంది. రైలు ఉదయం 11:05 గంటలకు పాతాళ్ పాని నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:05 గంటలకు కలకుండ్ చేరుకుంటుంది. అక్కడ ప్రయాణికులకు దాదాపు రెండు గంటల పాటు సేదతీరే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో గ్రామాన్ని సందర్శించడం, నది ఒడ్డున గడపడం, స్థానికంగా ప్రసిద్ధి చెందిన దాల్ బాఫ్లా, కలకండ్ లాంటి వంటకాలను రుచి చూడవచ్చు. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 3:30 గంటలకు కలకుండ్ నుంచి మొదలవుతుంది. సాయంత్రం 4:15 గంటలకు పాతాళ్ పాని చేరుకుంటుంది.
ఈ రైలులో నాన్-ఏసీ సెకండ్ సీటింగ్, ఏసీ విస్టాడోమ్ చైర్ కార్ అనే రెండు క్లాస్ లు ఉన్నాయి. సెకండ్ సీటింగ్ టికెట్ ధర ఒక్కొక్కరికి సుమారు రూ.20. తక్కువ ఖర్చుతో సహజసిద్ధమైన గాలి మధ్య ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. విస్టాడోమ్ చైర్ కార్ టికెట్ ధర ఒక్కొక్కరికి సుమారు రూ.265 నుంచి రూ.270 వరకు ఉంటుంది. పెద్ద గాజు కిటికీల ద్వారా చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను మరింత స్పష్టంగా చూడవచ్చు. IRCTC వెబ్ సైట్, మొబైల్ యాప్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రకృతి అందాలు, చరిత్ర, నెమ్మదైన రైలు ప్రయాణం.. ఒకేసారి ఆస్వాదించాలంటే పాతాళ్ పాని–కలకండ్ హెరిటేజ్ రైలు ప్రయాణం చేయాల్సిందే.
Read Also: ‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?