Stunning Pallom Lotus Fields: కేరళం మామూలు సమయంలోనే ప్రకృతి అందాలతో అద్భుతంగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో అక్కడి పచ్చని ప్రకృతి మరింత అందంగా మారుతుంది. అలాంటి అద్భుతమైన ప్రదేశాల్లో కొట్టాయం జిల్లాలోని పల్లం ఒకటి. ప్రతి ఏడాది జూలై నుంచి ఈ ప్రాంతం వేలాది గులాబీ రంగు తామర పువ్వులతో కళకళలాడుతూ పూల తివాచీలా కనిపిస్తుంది. ప్రకృతి ప్రేమికులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది.
పల్లం గ్రామంలోని వాలెక్కడవు–తొల్లయిరం పాదం ప్రాంతంలో ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది. పల్లం పులింతర శ్రీ మహాధవ గురునాథ ఆలయం సమీపంలోని వరి పొలాలు వర్షపు నీటితో నిండిపోగానే, వాటిపై లక్షలాది తామర పువ్వులు ఒకేసారి వికసిస్తాయి. పచ్చని పొలాల మధ్య గులాబీ రంగు పూలు పరుచుకుని కనిపించే దృశ్యం చూసినవారిని మంత్రముగ్ధులను చేస్తుంది. అందుకే ప్రతి ఏడాది ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు, పర్యాటకులు ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ఈ తామర పువ్వుల అందాన్ని ఆస్వాదించాలంటే ఉదయం వేళలోనే వెళ్లడం మంచిది. సూర్యోదయంతో పాటు పువ్వులు పూర్తిగా వికసిస్తాయి. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య ఈ ప్రాంతం అత్యంత అందంగా కనిపిస్తుంది. ఆ సమయంలో పొగమంచు, చల్లని వాతావరణం, మృదువైన సూర్యకాంతి కలిసి అద్భుతమైన దృశ్యంతో కనువిందు చేస్తాయి. సూర్యుడి వేడి పెరిగేకొద్దీ పువ్వులు నెమ్మదిగా వాడిపోతాయి. అందుకే తెల్లవారుజామున వెళ్లినవారే ఈ సహజ సౌందర్యాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా కారణంగా పల్లం పేరు దేశవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందింది. డ్రోన్ వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో ఈ ప్రాంతానికి వచ్చే సందర్శకుల సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు, నేచర్ ఫోటోగ్రఫీ కోసం చాలామంది ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటున్నారు.
నైరుతి రుతుపవనాల వల్ల వరి పొలాలు, చిత్తడి నేలలు పూర్తిగా నీటితో నిండిపోతాయి. ఈ పరిస్థితులు తామర మొక్కలు పెరిగి పూలు వికసించడానికి అనుకూలంగా ఉంటాయి. అందుకే జూన్ చివరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ ప్రాంతం గులాబీ వర్ణం తామరల సముద్రంలా మారిపోతుంది. కొన్ని సంవత్సరాల్లో అక్టోబర్ ప్రారంభం వరకు కూడా ఈ అందమైన దృశ్యం కనిపించే అవకాశం ఉంటుంది.
పల్లం, కొట్టాయం పట్టణానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గరలో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. కొట్టాయం రైల్వే స్టేషన్ కు దేశంలోని ప్రధాన నగరాల నుంచి రైలు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. రోడ్డు మార్గంలో కూడా మంచి కనెక్టివిటీ ఉంది. పల్లం వెళ్లినప్పుడు సమీపంలోని కుమారకోమ్, మలరిక్కల్, వేంబనాడ్ సరస్సు, పల్లం పులింతర శ్రీ మహాధవ గురునాథ ఆలయం లాంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. ఈ వర్షాకాలంలో కేరళకు వెళ్లే ఆలోచన ఉంటే, మీ ట్రిప్లో పల్లాన్ని తప్పకుండా యాడ్ చేసుకోండి. అక్కడి గులాబీ తామర పూల అందం మీ ప్రయాణాన్ని మరింత అద్భుతంగా మార్చేస్తుంది.
Read Also: మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!