Sangareddy Murder: సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. కేవలం కారుకు అడ్డంగా నిలబడ్డాడనే చిన్న కారణంతో మొదలైన వివాహం, చివరకు ఒక ప్రాణాన్ని బలిగొనేంత వరకు వెళ్ళింది. క్షణికావేశంలో ఒక వ్యక్తి చేసిన ఘాతుకం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
చిన్న గొడవ.. పెద్ద వివాదం
స్థానికంగా అందిన వివరాల ప్రకారం.. కంది గ్రామానికి చెందిన ఆంజనేయులు, శ్రవణ్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య కారుకు అడ్డంగా నిలబడటంపై చిన్నపాటి మాటల యుద్ధం మొదలైంది. “నా కారుకు అడ్డంగా ఎందుకు నిలబడ్డావు?” అంటూ ఆంజనేయులు శ్రవణ్తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవ పెద్దదిగా మారుతున్న సమయంలో, శ్రవణ్ తండ్రి రమేష్ అక్కడికి చేరుకున్నారు. యువకుల మధ్య జరుగుతున్న గొడవను సర్దిచెప్పి, విషయాన్ని ప్రశాంతంగా ముగించాలని రమేష్ ప్రయత్నించారు.
క్షణికావేశంలో ఘాతుకం.. కారుతో ఢీకొట్టి హత్య
తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి తనకు ఎదురు తిరుగుతున్నారనే కోపంతో ఆంజనేయులు ఊగిపోయాడు. గొడవ జరుగుతున్న ప్రదేశం నుండి ఒక్కసారిగా తన కారును ముందుకు పోనిచ్చిన అతడు, కాసేపటికే తీవ్ర ఆగ్రహంతో యూ టర్న్ తీసుకుని వెనక్కి వచ్చాడు. ఏమాత్రం మానవత్వం లేకుండా, అక్కడ నిలబడి ఉన్న రమేష్ను తన కారుతో అత్యంత వేగంగా, బలంగా ఢీకొట్టాడు. కారు ఢీకొట్టిన వేగానికి రమేష్ అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు విడిచారు. కళ్ల ముందే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో శ్రవణ్, కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు.
నిందితుడిపై పాత నేరాల చిట్టా
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఆంజనేయులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల విచారణలో నిందితుడికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంజనేయులుపై గతంలోనే హత్యాయత్నం కేసులతో పాటు, గంజాయి సరఫరా చేస్తున్నట్లు కూడా కేసులు నమోదయ్యాయని పోలీసులు గుర్తించారు. పాత నేరస్థుడు కావడంతోనే ఇంతటి ఘాతుకానికి వెనుకాడలేదని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ బస్సు ఢీ, స్పాట్లో 10 మంది