Karimnagar: స్వేచ్ఛ బ్యూరో: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో భూదౌర్జన్యం కలకలం రేపింది. గ్రామ పంచాయతీ కారోబార్ తన సొంత పొలానికి దారి కోసం, స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతుతో యాదవ సామాజిక వర్గానికి చెందిన రైతుపై జేసీబీతో హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రైతు మర్రి సమ్మయ్య ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.
బాధితుడు సమ్మయ్య పొలానికి ఇరువైపులా దారులు ఉన్నప్పటికీ, పక్కనే ఉన్న కారోబార్ శ్రీనివాస్, అతని బంధువులు సమ్మయ్య పట్టా భూమిని ఆక్రమించుకోవడానికి చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నంబర్ లేని జేసీబీతో సమ్మయ్య పొలంలోకి దూసుకొచ్చి గడ్డి కట్టలను ధ్వంసం చేశారు. “నా పొలంలో ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు?” అని ప్రశ్నించినందుకు, “నిన్ను చంపి అయినా సరే ఇక్కడి నుంచి దారి తీస్తాం” అంటూ కులం పేరుతో దూషించారు. అనంతరం జేసీబీ బకెట్తో బలంగా నెట్టడంతో సమ్మయ్య ఛాతికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆయన్ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఈ దారుణానికి స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్, కొందరు నాయకులు వత్తాసు పలుకుతున్నట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాము ఇల్లు నిర్మించుకునేందుకు అన్ని అనుమతులు ఉన్నా, కారోబార్ తన అధికార బలంతో ‘మీ సేవ’ దరఖాస్తులను తిరస్కరిస్తున్నాడని సమ్మయ్య భార్య రాజమణి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. అంతేకాకుండా, తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి జేసీబీ డ్రైవర్ (ఎస్సీ సామాజిక వర్గం) ద్వారా తమ కుటుంబంపై తప్పుడు అట్రాసిటీ కేసు పెట్టించేందుకు కారోబార్ కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు.
రాజకీయ, ఆర్థిక బలంతో ఒక రైతు ప్రాణాల మీదకు తెచ్చిన కారోబార్ శ్రీనివాస్, అతనికి సహకరించిన స్థానిక లీడర్లపై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబంతో పాటు గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Also read: Gomaram Bal Reddy: మేడ్చల్ కాంగ్రెస్లో బిగ్ ట్విస్ట్.. జిల్లా ఉపాధ్యక్షుడిగా బాల్రెడ్డి!