తిన్న తర్వాత ప్లేట్ తీయడం చాలామందికి నామోషీ. ఇళ్లలో కూడా ఇది సహజమే. చిన్నప్పుడు ఆ పని తల్లి చేస్తుంది, పెద్దయ్యాక తన ప్లేట్ కూడా భార్యే తీయాలని అనుకుంటారు చాలామంది. కానీ కొంతమంది మాత్రం ఆ పని వేరే వారు చేయడానికి ఇష్టపడరు. ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్లు తిన్న ప్లేట్ ని తామే తీస్తారు. అది వారికి తామిచ్చే గౌరవంగా భావిస్తారు. ఈరోజు నారా లోకేష్ అదే పని చేశారు. తన తండ్రి అంటే తనకెంత గౌరవమో తెలియజేశారు. సత్య సాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ హైస్కూల్ లో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. భోజనం చేయడం పూర్తయిన తర్వాత తన ప్లేట్ తోపాటు, తండ్రి తిన్న ప్లేట్ ని కూడా తీసుకెళ్లారు లోకేష్. ఈ సన్నివేశం అక్కడున్న అందర్నీ ఆకట్టుకుంది.
ఎంత గొప్ప సంస్కారం..
తాను తిన్న ప్లేటుతో పాటు తన తండ్రి భోజనం చేసిన ప్లేటు కూడా తీశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. #MegaPTM2inAP#MegaParentTeacherMeeting#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#NaraLokesh pic.twitter.com/yEVKu56aGq
— Telugu Desam Party (@JaiTDP) July 10, 2025
తండ్రి ఆశీర్వాదం..
నారా లోకేష్ కి తల్లిదండ్రులంటే ఎంతో గౌరవం. ఏ పని మొదలు పెట్టాలన్నా వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈరోజు కొత్తచెరువు స్కూల్ లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందే లోకేష్ ఆ స్కూల్ కి చేరుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు రాగా, ఆయనకు పాదాభివందనం చేశారు లోకేష్. స్కూల్ లో పిల్లలకు సీఎం పాఠాలు చెప్పగా, లోకేష్ కూడా ఒక స్టూడెంట్ లాగా బెంచ్ పై కూర్చుని పాఠాలు విన్నారు. తన స్కూల్ డేస్ ని ఆయన గుర్తు చేసుకున్నారు. తన స్కూల్ లో జరిగే పేరెంట్స్ మీటింగ్ కి తండ్రిగా చంద్రబాబు హాజరు కాలేకపోయేవారని, రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల తాను కూడా తన కొడుకు స్కూల్ లో జరిగే పేరెంట్స్ మీటింగ్ కి హాజరు కాలేకపోతున్నానని చెప్పారు లోకేష్. ప్రభుత్వ స్కూళ్లతోపాటు అన్ని ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఈ మీటింగ్ జరగడం సంతోషంగా ఉందన్నారాయన.
సహపంక్తి భోజనం..
పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్.. పాఠశాల విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. అక్కడ విద్యార్థులకు అందుతున్న వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. సహపంక్తి భోజనంలో పిల్లలతో కలసి కూర్చుని భోజనం చేశారు చంద్రబాబు, లోకేష్. తండ్రి, కొడుకు మధ్య మరో బాలిక కూర్చుంది. పిల్లలతో మాట్లాడుతూ వారిద్దరూ భోజనం పూర్తి చేశారు. తిన్న తర్వాత ముఖ్యమంత్రి పైకి లేవగా.. వెంటనే లోకేష్ కూడా పైకి లేచారు. సహజంగా మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తాను తిన్న భోజనం ప్లేట్ ని తానే తీసుకుని పక్కకు వెళ్తారని ఎవరూ అనుకోరు. కానీ లోకేష్ మాత్రం తాను తిన్న ప్లేట్ ని తానే తీశారు, పక్కన తన తండ్రి తిన్న ప్లేట్ ని కూడా ఆయనే తీశారు. ఆ సన్నివేశం అందర్నీ ఆకట్టుకుంది. లోకేష్ కి తండ్రి అంటే ఎంత గౌరవమో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ అంటున్నారు. లోకేష్ వ్యక్తిత్వం గురించి తెలిసినవారికి ఇది ఒక సాధారణమే అయినా, ఈరోజుల్లో కూడా ఇలాంటి అరుదైన నాయకులు ఉన్నారా అని ఆ వీడియోలు, ఫొటోలు చూసినవారు అనుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అభిమానుల పోస్ట్ లకు అంతే లేదు. తండ్రీ కొడుకులుగా చంద్రబాబు, లోకేష్ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆ వీడియోలను, ఫొటోలను షేర్ చేస్తున్నారు. లోకేష్ వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తున్నారు.