Dubai Air Show: అంతర్జాతీయ దుబాయ్ ఎయిర్ షోలో ఈ రోజు మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. భారత్ తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ విమానం ప్రమాదానికి గురవడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదం మధ్యాహ్నం సుమారు 2:10 గంటల సమయంలో జరిగింది. విమానం కూలిన వెంటనే అక్కడ భారీగా మంటలు చెలరేగాయి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ సంఘటన ఎయిర్ షో చూస్తున్న ప్రేక్షకులను కలవరపరిచింది.
ప్రమాదానికి గురైన ఈ తేజస్ యుద్ధ విమానాన్ని బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL సంస్థ తయారు చేసింది. భారత్ స్వదేశీ యుద్ధ విమాన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఉద్దేశంతో దుబాయ్ ఎయిర్ షోలో ప్రదర్శనకు ఉంచారు. విమానం గగనతల విన్యాసం చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కూలిపోయిన విమానం పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం.
ప్రమాదంలో పైలట్ మృతి..
ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. విమానం కూలి మంటలు రావడంతో ఎయిర్ షో నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదంపై భారత వైమానిక దళం విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.
తేజస్ యుద్ధ విమానం ఆధునిక సాంకేతికతతో రూపొందించారు. రక్షణ రంగంలో భారత్ సాధించిన పురోగతికి ఇది నిదర్శనం. అటువంటి విమానం ప్రమాదానికి గురవడం భారత్కు కొంత ఇబ్బందికర పరిణామంగా మారింది. పైలట్ పరిస్థితి కారణాలు నిర్ధారించడానికి పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంది. దుబాయ్ ఎయిర్ షోలో ఈ తరహా ప్రమాదం జరగడం తీవ్ర ఆందోళన కలిగించింది. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.