BC Reservations:హైదరాబాద్లో జరిగిన బీసీ సంఘాల కీలక సమావేశం, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా వేడెక్కింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటుడు, ప్రజా ఉద్యమకారుడు ఆర్. నారాయణ మూర్తి తనదైన శైలిలో ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. దేశానికి వెన్నుముకగా నిలిచిన బీసీ కులాలపై బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని 14 రాష్ట్రాల్లో బ్రాహ్మణులే ముఖ్యమంత్రులుగా పనిచేశారని, కానీ మెజారిటీ వర్గాలైన బీసీలకు మాత్రం రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందని ఆయన చరిత్రను గుర్తు చేశారు.
ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ పై చేసిన తీర్మానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా కల్పించాలని, మీ మాట నమ్మి బీసీలు మీకు ఓట్లు వేశారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయవద్దని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, లేకపోతే బీసీ ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు.
రిజర్వేషన్ల విషయంలో కేంద్రం తీరును కూడా ఆయన ఎండగట్టారు. ప్రధాని మోదీ వద్దకు రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులను తీసుకువెళ్లాలని, ఒకవేళ కేంద్రం రిజర్వేషన్లకు అంగీకరించకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి, ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అగ్రవర్ణ పేదలకు ఆగమేఘాల మీద రిజర్వేషన్లు ఇచ్చిన కేంద్రం, బీసీల విషయంలో ఎందుకు తాత్సారం చేస్తోందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ “గడ్ బడ్” చేయమంటున్నారని, కానీ బీసీలు తమ హక్కుల కోసం రాజీపడకూడదని ఆయన అన్నారు.
తెలంగాణలో బీసీల హక్కుల కోసం మరో భారీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఆసన్నమైందని నారాయణ మూర్తి పిలుపునిచ్చారు. ఇందుకోసం బీసీలలోని అన్ని ఉప కులాలు, సంఘాలు ఒక్క తాటిపైకి రావాలని కోరారు. ఇన్నాళ్లు “ఓట్లు మావి.. సీట్లు మీవా?” అన్న ధోరణి సాగిందని, ఇకపై అది చెల్లదని తేల్చిచెప్పారు. “ఓట్లు మావే.. సీట్లు మావే” అనే నినాదంతో భారీ పోరాటానికి సిద్ధం కావాలని, ఐక్యమత్యంతోనే రాజ్యాధికారం సాధ్యమని ఆయన బీసీ వర్గాలకు దిశానిర్దేశం చేశారు.