భారతదేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మధ్యతరగతి పౌరులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. వికసిత భారత్ లక్ష్యంలో ప్రజాస్వామ్యం, జనాభా శక్తి, డిమాండ్ అనే మూడు పిల్లర్లతో పాటు మధ్యతరగతి ప్రజల శక్తి సామర్థ్యాలను ప్రభుత్వం గుర్తించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం, మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచడమే కాకుండా వారిపై ఉన్న పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది.
మధ్యతరగతికి ఊరట.. రూ.12 లక్షల వరకు జీరో ట్యాక్స్
తాజా సంస్కరణల ప్రకారం, కొత్త పన్ను విధానం కింద ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే సగటున నెలకు రూ.1 లక్ష వరకు సంపాదించే వ్యక్తులు పన్ను పరిధిలోకి రారు. గడచిన పదేళ్లలో ప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితిని క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. 2014లో కేవలం రూ.2.5 లక్షలుగా ఉన్న ఈ పరిమితిని, 2019లో రూ.5 లక్షలకు, 2023లో రూ.7 లక్షలకు పెంచిన ప్రభుత్వం.. తాజాగా దానిని రూ.12 లక్షలకు చేర్చి మధ్యతరగతిపై తమకున్న నమ్మకాన్ని చాటుకుంది.
వేతన జీవులకు ప్రత్యేక ప్రయోజనం..
ముఖ్యంగా జీతాలు పొందే ఉద్యోగులకు (Salaried Tax Payers) ఈ మార్పులు మరింత లాభదాయకంగా మారనున్నాయి. వీరికి వర్తించే స్టాండర్డ్ డిడక్షన్ను రూ.75,000 కు పెంచడం వల్ల, వీరి మొత్తం ఆదాయం రూ.12.75 లక్షల వరకు ఉన్నప్పటికీ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల మధ్యతరగతి చేతిలో నికరంగా మిగిలే ఆదాయం పెరిగి గృహ అవసరాల వినియోగం, పొదుపు, పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.
కొత్త పన్ను స్లాబుల వివరాలు:
అందరికీ ప్రయోజనం చేకూరేలా పన్ను రేట్లను మరియు స్లాబులను ప్రభుత్వం సమూలంగా మార్చింది. కొత్తగా ప్రతిపాదించిన పన్ను నిర్మాణం ఇలా ఉంది.
0 – 4 లక్షలు: జీరో
4 – 8 లక్షలు: 5 శాతం
8 – 12 లక్షలు: 10 శాతం
12 – 16 లక్షలు: 15 శాతం
16 – 20 లక్షలు: 20 శాతం
20 – 24 లక్షలు: 25 శాతం
24 లక్షల పైన: 30 శాతం
దేశాభివృద్ధిలో భాగస్వాములుగా..
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మధ్యతరగతి వారి భాగస్వామ్యం వెలకట్టలేనిదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో కంటే సులభతరమైన పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పౌరులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, పన్నుల చెల్లింపులో పారదర్శకత పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఈ సంస్కరణలు మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా, దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ALSO READ: Stock Market: నిర్మల బడ్జెట్ వేళ.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్, 2300 పాయింట్లు కోల్పోయిన బీఎస్ఈ