IndiGo Flights: ఇండిగో విమాన సంస్థకు ఊహించని షాక్ తగిలింది. డిసెంబర్ నెలలో విమానాలకు భారీ అంతరాయం కలిగించినందుకు ఆ సంస్థకు DGCA ఝలక్ ఇచ్చింది. ఏకంగా రూ.22 కోట్ల జరిమానా విధించింది. సీనియర్ మేనేజ్మెంట్పై కఠినమైన అమలు చర్యలు తీసుకుంది.
ఇండిగో సంస్థకు భారీ షాక్
దేశంలో ప్రముఖ ఇండిగో విమాన సంస్థపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్- DGCA భారీ జరిమానా విధించింది. గతేడాది డిసెంబర్లో వేలాది విమానాల రద్దు, ఆలస్యం కావడంతో ఏకంగా రూ. 22.20 కోట్ల జరిమానా విధించింది. కేవలం ఇండిగో నిర్లక్ష్యం వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కఠిన చర్యలు చేపట్టింది DGCA.
కొద్దిరోజులుగా ఇండిగో సంస్థ వ్యవహారంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ ఆదేశాలతో డీజీసీఏ ఓ కమిటీని నియమించింది. నలుగురు సభ్యుల కమిటీ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది. విమానాలు, సిబ్బందిని అధికంగా ఉపయోగించుకోవడం, సాఫ్ట్వేర్లో లోపాలు, యాజమాన్య పర్యవేక్షణ లోపం వంటివి అందుకు కారణమని తేల్చింది.
రూ. 22 కోట్లు జరిమానా వేసిన DGCA
కొత్తగా వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్-FDTL నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలం చెందిందని కమిటీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ కఠినచర్యలు చేపట్టింది. నిబంధనల ఉల్లంఘనలకు రూ.1.80 కోట్లు, రెండునెలలు పైగానే నిబంధనలు పాటించనందుకు రోజుకు రూ. 30 లక్షల చొప్పున ఈ జరిమానా విధించింది.
అంతేకాదు ‘ఇండిగో సిస్టమిక్ రిఫార్మ్ అష్యూరెన్స్ స్కీమ్ కింద రూ. 50 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలని కూడా ఆదేశించింది. డిసెంబర్ 3 నుంచి 5 మధ్యకాలంలో 2,507 విమానాలు రద్దు చేసింది. 1,852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీని ప్రభావం దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా ఎయిర్ ట్రావెలర్స్పై ప్రభావం చూపింది. ఎయిర్లైన్ లో సంక్షోభానికి పై నాలుగు కారణాలను ఆ కమిటీ గుర్తించింది.
ALSO READ: భూమిపైకి అసలు బంగారం ఎలా వచ్చింది?
ఇండిగో సంస్థ సీఈవో, సీఓఓలకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ని ఆ బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించింది. ఆలస్యమైన విమానాల్లో ప్రయాణికులకు 10 వేల విలువైన వోచర్లు అందించడాన్ని డీజీసీఏ పరిగణనలోకి తీసుకుంది.
DGCA విధించిన జరిమానాలపై ఓ సీనియర్ అధికారి మాట్లాడారు. నిబంధనల ప్రకారం తాము విధించిన గరిష్ట జరిమానా ఇదేనని పేర్కొన్నారు. అంతరాయాలు కలిగించినందుకు తాము ఏ విమానయాన సంస్థపై విధించిన అత్యధిక జరిమానా ఇదేనని అన్నారు. గతంలో కోటి రూపాయలకు మించి జరిమానాలు లేవన్నారు. పౌర విమానయాన శాఖ, దాని కార్యాచరణ బలోపేతం చేయడం, ప్రయాణీకుల ప్రయోజనాలను కాపాడటం, పైలట్లు, సిబ్బంది శ్రేయస్సును కాపాడటం చర్యల లక్ష్యమని DGCA తెలిపింది.