బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది విశ్వం అందించిన ఒక అపురూపమైన కానుక. భారత్లో అమాంతం పెరుగుతున్న బంగారు ధరలు ఒకెత్తయితే, అసలు ఈ బంగారం భూమి మీదకు ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన అంశంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పుడు కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు.
సాధారణంగా భూమిపై లభించే లోహాలు భూగర్భంలోనే పుడతాయని మనం భావిస్తుంటాం. కానీ, శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం మనం వాడుతున్న బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాలు ఈ భూమిపై పుట్టినవి కావు. అవి సుదూర అంతరిక్షం నుండి ఉల్కల రూపంలో భూమికి చేరాయి. భూమి ఆవిర్భవించిన కొత్తలో బంగారం వంటి భారీ లోహాలన్నీ భూమి కేంద్రభాగంలోకి (కోర్ అని అంటారు) కుంగిపోయాయి. ప్రస్తుతం మనం వెలికితీస్తున్న బంగారం అంతా కూడా ఆ తర్వాత కాలంలో జరిగిన ఉల్కాపాతాల ద్వారా భూమిపైకి చేరినదేనని ఖగోళ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
మ్యాగ్నెటార్.. శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం..
ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధనలో బంగారు పుట్టుకకు సంబంధించిన మరో అద్భుతమైన ఆధారం లభించింది. ఒక ‘మ్యాగ్నెటార్’ (అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం కలిగిన నక్షత్రం) నుండి వెలువడిన భారీ జ్వాల కారణంగా ఈ భారీ లోహాలు తయారవుతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మన గెలాక్సీలోని బంగారం, ప్లాటినం వంటి లోహాలలో సుమారు 10 శాతం కేవలం ఇటువంటి నక్షత్ర విస్ఫోటనాల వల్లే ఏర్పడుతున్నాయని లెక్కగట్టారు.
20 ఏళ్ల క్రితం నాటి సిగ్నల్తో అంచనా…
2004వ సంవత్సరంలో భూమిపై ఉన్న టెలిస్కోపులు ఒక అరుదైన సిగ్నల్ను గుర్తించాయి. ఈ సిగ్నల్ ఒక మ్యాగ్నెటార్ నుండి వెలువడింది. ఆ నక్షత్రం వెదజల్లిన రేడియేషన్ కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉన్నప్పటికీ.. అది మన సూర్యుడు ఒక మిలియన్ ఏళ్లలో విడుదల చేసే శక్తి కంటే ఎక్కువ శక్తిని విడుదల చేసింది. ఆ సమయంలోనే బంగారం, ప్లాటినం వంటి మూలకాలు తయారైనట్లు శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు. కేవలం 2004లో వచ్చిన ఆ ఒక్క జ్వాల ద్వారానే భూమి ద్రవ్యరాశిలో మూడో వంతుకు సమానమైన భారీ లోహాలు తయారయ్యాయని అంచనా వేయడం విశేషం.
అనిరుధ్ పటేల్ పరిశోధనలో కీలక అంశాలు..
ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన అనిరుధ్ పటేల్ కీలక విషయాలు వెల్లడించారు. ‘మనం వాడుతున్న ఫోన్లు, కంప్యూటర్లలో ఉండే విలువైన లోహాలు అంతరిక్షంలోని అత్యంత భయంకరమైన వాతావరణంలో తయారవుతాయని అనుకోవడం అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నారు. బిగ్ బ్యాంగ్ సమయంలో కేవలం హైడ్రోజన్, హీలియం వంటి తేలికపాటి వాయువులే పుట్టాయని, బంగారం వంటి భారీ లోహాలన్నీ నక్షత్రాల విస్ఫోటనాల వల్లే ప్రాణం పోసుకున్నాయని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. ఈ వివరాలన్నీ ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్’లో ప్రచురితమయ్యాయి.