2023 – టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారత్ భారీగా సాయం చేసింది.
2025 – పాకిస్తాన్ – భారత్ మధ్య యుద్ధం రాగానే టర్గీ పాక్ కి డ్రోన్లు అందించి సాయం చేసింది.
ఈ ఉదాహరణ చాలదా టర్కీది మిత్రద్రోహం అని చెప్పడానికి. ఈ మిత్రద్రోహానికి మరి భారత్ కూడా బదులు చెప్పాలి కదా..? అలా చెప్పాలంటే భారత్ ఏంచేయాలి..? ఏం చేస్తే టర్కీకి బుద్ధి వస్తుంది. టర్కీతోపాటు ఇలాంటి నక్కజిత్తులతో వ్యవహరించే అజర్ బైజాన్ వంటి దేశాలకు భయం మొదలవుతుంది. అసలు భారత్ ఏం చేయాలి..?
భారత్ – పాక్ ఉద్రిక్తతల మధ్య దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ తటస్థంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణాన్ని గమనిస్తున్నాయి. శాంతి చర్చలు జరగాలని ఆకాంక్షిస్తున్నాయి. అయితే టర్కీ మాత్రం పాకిస్తాన్ స్టాండ్ తీసుకుంది. ఆ దేశానికి డ్రోన్లను సరఫరా చేస్తూ భారత్ పై దాడికి పరోక్ష సహకారం అందిస్తోంది. టర్కీ సరఫరా చేసిన దాదాపు 400 డ్రోన్లను భారత్ పైకి ప్రయోగించింది పాక్. అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ పై యుద్ధం చేస్తూనే టర్కీకి కూడా గుణపాఠం చెప్పాలన్నమాట. అలా గుణపాఠం చెప్పాలంటే టర్కీపై ముప్పేట దాడి చేయాలి. అష్టదిగ్బంధనం చేసి అట్టుడికిపోయేలా మార్చాలి.
దౌత్యపరమైన ఒత్తిడి..
పాకిస్తాన్ కి టర్కీ సాయం చేస్తున్న విషయం ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. ఈ దశలో భారత్ తో పాటు ఇతర దేశాలు కూడా టర్కీ వ్యవహారాన్ని ఖండిస్తున్నాయి. కేవలం ఖండంచి సరిపెడితే సరిపోదు ఆ దేశాన్ని దౌత్యపరమైన చిక్కుల్లో పడేయాలంటే ముందుగా రాయబార కార్యకలాపాలను భారత్ నిలిపివేయాలి. అక్కడ ఉన్న మన రాయబారుల్ని వెనక్కి పిలిపించాలి. కొత్తవారిని నియమించే విషయంలో వీలైనంత జాప్యం చేయాలి.
అంతర్జాతీయ వేదికలపై టర్కీ వ్యవహారాన్ని బట్టబయలు చేయడం ద్వారా ఆ దేశాన్ని ఒంటరిని చేయొచ్చు. పాకిస్తాన్ కి టర్కీ మద్దతిచ్చింది అంటే, పరోక్షంగా ఉగ్రవాదాన్ని కూడా ఆ దేశం సమర్థించినట్టే లెక్క. అంటే టర్కీని కూడా ఉగ్రవాద దేశాల జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రయత్నించాలి.
ఆర్థిక ఆంక్షలు..
టర్కీ, భారత్ మధ్య జరుగుతున్న వాణిజ్యంపై ప్రభుత్వం ఆంక్షలు విధించాలి. అధిక సుంకాలు విధించడం ద్వారా టర్కీ ఆదాయాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. వివిధ వస్తువుల ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించే అవకాశముంది. అలా చేస్తే టర్కీ ఆర్థిక మూలాలను కూడా దెబ్బకొట్టినట్టవుతుంది.
పర్యాటకంపై దెబ్బ..
టర్కీ పర్యాటకరంగానికి భారతీయులు కూడా ప్రధాన ఆదాయ వనరు. మనదేశ పర్యాటకులతో ఆదాయం పొందుతో, మన దేశ పౌరుల్ని చంపేందుకు టర్కీ, పాక్ కి డ్రోన్లు ఇచ్చిందంటే ఆ దేశాన్ని ఏమనుకోవాలి. అలాంటి చర్యలకు ప్రతిగా భారత్ కూడా పర్యాటకరంగం విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ దిశగా ఇప్పటికే అడుగులు పడ్డాయి. టర్కీకి కొత్తగా పర్యాటకుల్ని పంపే విషయంలో ట్రావెల్ ఏజెన్సీలు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని కేంద్రం ప్రకటించింది. దీంతో ట్రావెల్ ఏజెన్సీలు టర్కీకి బుకింగ్ లు ఆపివేశాయి. భారత్ చర్యతో టర్కీ పర్యాటక రంగం సంక్షోభంలో పడే అవకాశముంది.
టర్కీని నేరుగా ఇబ్బంది పెట్టకుండా.. ఆ దేశానికి ఉన్న శత్రు దేశాల్ని భారత్ మంచి చేసుకోవడం మరో మార్గం. టర్కీని శత్రువుగా చూసే దేశాలతో భారత్ ఆర్థిక వాణిజ్య సంబంధాలు పెంచుకుంటే.. పరోక్షంగా అది టర్కీకి ఇబ్బందికరంగా మారుతుంది.
పాకిస్తాన్ కి డ్రోన్లను సరఫరా చేయడంతోపాటు, నావికా దళం విషయంలో కూడా టర్కీ సహాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని భారత్ సమర్థంగా తిప్పికొట్టాలి. హిందూ మహాసముద్రంలో భారత్ నావికాదళ గస్తీని పెంచాలి. INS విక్రాంత్ మరియు INS విశాఖపట్నం వంటి యుద్ధ నౌకల్ని మోహరించడం ద్వారా పాకిస్తాన్ కి టర్కీ సాయాన్ని నియంత్రించే అవకాశం ఉంది. ఏది ఏమైనా టర్కీ విషయంలో భారత్ కఠినంగా వ్యవహరించాల్సిన సందర్భం ఇది. కష్టకాలంలో మన సాయం పొందిన టర్కీ, యుద్ధ సమయంలో మనకు సాయం చేయకపోగా, మన ప్రత్యర్థి పాకిస్తాన్ తో చేతులు కలపడం మరింత దారుణం. అందుకే టర్కీ విషయంలో భారత్ వైఖరి.. ఇతర పాకిస్తాన్ అనుకూల దేశాలకు ఒక గుణపాఠంలా మారాలి. భారత్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అనే సిగ్నల్స్ మనం బలంగా పంపించగలగాలి.