India is a strategic partner- US Says: ఉక్రెయిన్ సంక్షోభం వేళ ప్రధాని మోదీ మాస్కో పర్యటనను పాశ్చాత్య దేశాలు ఆసక్తిగా గమనించిన విషయం విధితమే. రష్యాతో భారత్ సన్నిహిత సంబంధాలపై అగ్రరాజ్యమైన అమెరికా తాజాగా స్పందించింది. ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నవని గుర్తుచేసింది.
అమెరికా విదేశాంగ శాఖ, రక్షణ శాఖలు స్పందించాయి. ‘భారత్, రష్యాల మధ్య చాలాకాలంగా ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. అయితే, అమెరికా కోణంలో చూస్తే భారత్ వ్యూహాత్మక భాగస్వామే. రష్యాతో వారి సంబంధాల విషయమై మాకు పూర్తి స్పష్టత ఉంది. ఈ వారం నాటూ శిఖరాగ్ర సదస్సు జరగనున్న సందర్భంలో మోదీ పర్యటన చేయడంతో యావత్ ప్రపంచం దృష్టి సారించింది’ అంటూ పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ ప్యాట్ రైడర్ అన్నారు.
‘ప్రపంచ దేశాలతో తామ దూరం కాలేదని ఈ పర్యటన ద్వారా పుతిన్ ప్రకటించుకున్నా.. అందులో ఆశ్చర్యం లేదు. యుద్ధానికి వెళ్లాలనే నిర్ణయమే రష్యాను ప్రపంచానికి దూరం చేసింది. దాని వల్ల రష్యా ఎంతో మూల్యం చెల్లిస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి కేవలం రష్యాతోనే కాకుండా జెలెన్ స్కీతోనూ ఇటీవల మోదీ మాట్లాడారు. శాంతియుత పరిష్కారానికి భారత్ మద్దతు ఇస్తుందనే భరోసా కల్పించిన విషయాన్ని గుర్తుచేస్తున్నాం’ అంటూ ప్యాట్ రైడర్ పేర్కొన్నారు.
Also Read: మోదీ పర్యటన అనంతరం రష్యా ప్రకటన, మాకు అస్సలు ఇష్టం లేదంటూ..
రష్యాతో భారత్ సంబంధాలపై ఆందోళనలు ఉన్నప్పటికీ వాటిపై తమకు స్పష్టత ఉందంటూ అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. ఈ రెండు దేశాల మైత్రి కొనసాగింపుపై తమ ఆందోళనలను భారత్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, రష్యాతో భారత్ కు ప్రత్యేకమైన, వ్యూహాత్మకమైన భాగస్వామ్యం ఉన్న విషయం విధితమే.