Gold – Pink Paper: గతంలొ బంగారం అనగానే గుర్తుకు వచ్చే కొన్ని జ్ఞాపకాల్లో గులాబీ రంగు కాగితం ఒకటి. బంగారపు షాపుల్లో కొనుగోలు చేసిన ఆభరణాలను ఒక లేత గులాబీ రంగు డిజైన్ కాగితంలో చుట్టి, దానికి దారంతో ముడివేసి కస్టమర్లకు ఇవ్వడం శతాబ్దాల తరబడి ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వచ్చింది. అయితే కాలక్రమేణా ఈ ఆచారం కనుమరుగవుతూ వస్తోంది. గ్రామాలు, పట్టణాల్లోని స్థానిక బంగారు షాపుల్లో ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ.. నగరాల్లోని ప్రముఖ జ్యూయలరీ షాపుల్లో ఈ ట్రెడిషన్ కనిపించడం లేదు. అసలు ఈ గులాబీ కాగితానికి, బంగారు అభరణాలకు లింకేంటి? దీని వెనుక ఉన్న కథేంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒకప్పుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ఏ ఆభరణాల దుకాణాల్లో చూసిన ఈ గులాబీ రంగు కాగితమే కనిపించేది. నగల షాపులకు వెళ్లేవారికి ఆభరణాల కొనుగోలుతో పాటు ఈ ‘పింక్ పేపర్’ ఒక భావోద్వేగ అనుబంధంగా మారిపోయింది. కాగితంలో నగను చుట్టి చేతికి ఇవ్వడం పసిడి కొనుగోలులో ఒక చిహ్నంగా మారిపోయింది.
బంగారాన్ని గులాబీ రంగు కాగితంలో ఇవ్వడం వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. సాధారణ కాగితాలతో పోలిస్తే ఈ పింక్ పేపర్లు చాలా మృదువుగా ఉంటాయి. ఇవి నగలకు ఎలాంటి గీతలు పడకుండా చూస్తాయి. అంతేకాకుండా గులాబీ రంగు పేపర్లో బంగారం ఉంచినప్పుడు పసిడి మరింత ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుందని చెబుతుంటారు. ఇదిలా ఉంటే గతంలో ఈ గులాబీ రంగు కాగితాలను యాసిడ్ రహిత (Acid-free) పద్ధతిలో తయారు చేసేవారు. దీనివల్ల బంగారంలోని లోహపు అణువులు పేపర్ కు మధ్య ఎలాంటి రసాయనిక చర్యకు ఆస్కారం ఉండేది కాదు.
సాధారణంగా ఇనుము వంటి లోహాలు.. గాలిలో ఉంచినప్పుడు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. అయితే 24 క్యారెట్ల గోల్డ్ ఇందుకు అతీతం అయినప్పటికీ.. ఆభరణల తయారీలో కలిసే రాగి, వెండి వంటి లోహాలు.. గాలి వల్ల ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా గాలిలోని తేమ, సల్ఫర్ వల్ల వీటి షైనింగ్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. కాబట్టి నేరుగా ఆభరణాలకు గాలి తగలకుండా పింక్ పేపర్ రక్షణగా నిలుస్తుంది.
Also Read: యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!
ప్రస్తుత రోజుల్లో సాంకేతికతతో పాటు ఫ్యాషన్ మారడంతో ఈ గులాబీ కాగితాల వాడకం తగ్గుతూ వస్తోంది. కాగితాల స్థానంలో సున్నితమైన వెల్వెట్ బాక్సులు, లగ్జరీ లేదర్ కేసులు, డిజైనర్ పౌచ్లు అందుబాటులోకి వచ్చాయి. పైగా ప్రస్తుత డిజైనర్ నగలకు కాగితం కంటే దృఢమైన బాక్సుల అవసరం బాగా పెరిగిపోయింది. దీనికి తోడు జ్యువెలరీ షాపులు తమ సొంతత లోగోలు, రంగులతో కూడిన ప్యాకేజింగ్కు ప్రాధాన్యత ఇస్తుండటంతో పాతకాలపు గులాబీ కాగితం క్రమంగా కనుమరగవుతోంది.
Also Read: సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!