Iran Vs America: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయా? యుద్ధం జరగకుండా ఉండేలా అమెరికా ప్రతినిధుల సభ ట్రంప్ను కట్టడి చేసిందా? ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులు తీవ్రతరం చేసిందా? జరుగుతున్న పరిణామాలను గమనించిన ట్రంప్, ఇరాన్ ఆస్తులపై కన్నేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ యుద్ధంతో నష్టపోయిన మిత్ర దేశాలకు సాయం చేయాలని ఆలోచన చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రూటు మార్చిన ఇరాన్.. పొరుగు దేశాలపై దాడులు తీవ్రతరం
ఇరాన్ రూటు మార్చింది. అమెరికా మిత్రదేశాలు బహ్రెయిన్, కువైట్ లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఎడా పెడా విరుచుకుపడుతోంది. దీంతో రంగంలోకి దిగిన అమెరికా బలగాలు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అంతేకాదు ఇరాన్లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టాయి. దీంతో ఇరుదేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నాయి.
అమెరికా సెంట్రల్ కమాండ్ చెబుతున్న వివరాల మేరకు.. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ డ్రోన్లను కూల్చివేసిన కొద్ది గంటల్లో క్షిపణుల దాడులు చోటు చేసుకున్నాయి. బహ్రెయిన్, కువైట్లపై ఇరాన్ ఏడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఆరింటిని తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ప్రస్తావించింది.
ఇరాన్ ఆస్తులపై ట్రంప్ కన్ను?
బహ్రెయిన్లోని అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన ఆఫీసు, ఇతర సైనిక స్థావరాలపై దాడులు చేశామన్న ఇరాన్ వాదనలను తోసిపుచ్చింది అమెరికా. తమ సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపింది. పరిస్థితి గమనించిన అమెరికా దళాలు ఇరాన్పై ప్రతీకార దాడులకు దిగాయి.
హార్ముజ్ జలసంధి సమీపంలోని గొరుక్, క్వెష్మ్ దీవుల్లోని ఇరాన్ రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించాయి. భవిష్యత్తులో ఇలాంటి దాడులను నివారించేందుకు ఆత్మరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది. ఇరుదేశాల మధ్య తరహా దాడులు కంటిన్యూ అయితే గల్ఫ్లో శాంతి స్థిరత్వాలకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.
ALSO READ: నీళ్లు లేక నరకయాతన.. సహారా ఎడారిలో 49 మంది దుర్మరణం
ఇరాన్ దూకుడు చూసిన అమెరికా, సరి కొత్త అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తోంది. ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గల్ఫ్లోని మిత్రదేశాల పునర్నిర్మాణానికి సాయం అందించాలని అమెరికా భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటివరకు స్థంభించిన ఇరాన్ ఆస్తులను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు రాసుకొచ్చాయి.
గల్ఫ్లో మిత్రదేశాలకు కలిగిన నష్టాన్ని అంచనా వేయాలని అమెరికా ఆర్థిక మంత్రి బెసెంట్ ఓ బృందాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నాయి. ఆయా ఆస్తులను భవిష్యత్తు పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం కాకుండా నష్టానికి పరిహారంగా అందించాలని భావిస్తున్నట్లు వెల్లడించాయి. ఈ విషయం తెలియగానే ఇరాన్ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. అమెరికా చేస్తున్న పనులు, ఇరాన్కు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. శాంతి ఒప్పందం కుదరాలంటే అమెరికా స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది ఇరాన్.