Devaracherla Muni Shivalayam: దుర్భేద్యమైన అడవులు, ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి మధ్య నిరంతరం జాలువారే జలపాతం. ఆ జలధారలు నేరుగా శివలింగంపై పడుతూ సహజసిద్ధంగా అభిషేకం చేస్తున్న అద్భుత దృశ్యం చూడాలంటే నల్లగొండ జిల్లా దేవరచర్లకు వెళ్లాల్సిందే. ప్రకృతి, ఆధ్యాత్మికత ఒకేచోట కలిసిన ఈ ప్రాంతాన్ని చాలామంది తెలంగాణ అరకు అని పిలుస్తారు.
దేవరచర్ల గ్రామం నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఉంది. దేవరకొండ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి మరో ఐదు కిలోమీటర్లు కాలినడకన వెళ్తే మునిస్వామి గుట్టకు చేరుకోవచ్చు. గుట్టపై నుంచి జాలువారే జలపాతం కింద కొలువై ఉన్న శివలింగమే ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. సంవత్సరమంతా నీరు శివలింగంపై పడుతుండటంతో భక్తులు దీనిని ప్రకృతి ప్రసాదించిన పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. మునిస్వామి గుట్టలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శివాలయం కూడా ఉంది. ఆలయం పక్కనే ఒక పురాతన సొరంగ మార్గం కనిపిస్తుంది. ఇది ఎప్పుడు నిర్మించబడిందో స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ, స్థానిక గిరిజనులు తమ పూర్వీకుల కాలం నుంచే ఈ ఆలయం, జలపాతం ఉన్నాయని చెబుతుంటారు.
దేవరచర్ల గ్రామానికి చెందిన కేతావత్ గోపా అనే వ్యక్తి సుమారు 70 ఏళ్ల క్రితం పశువులను మేపుతుండగా ఈ శివలింగాన్ని చూసినట్లు స్థానికులు చెప్తుంటారు. అప్పటి నుంచి గిరిజనులే ఆలయంలో పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, ఏకాదశి సందర్భంగా గోపా బావోజీ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో వందలాది మంది భక్తులు గుట్టపైకి చేరుకుని దర్శనం చేసుకుంటారు. మిగతా రోజుల్లో ఈ ప్రాంతం తక్కువ జనసంచారంతో ఉంటుంది.
ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో విశ్వాసాలు ప్రచారంలో ఉన్నాయి. అపవిత్రంగా వచ్చిన వారిపై గబ్బిలాలు, కందిరీగలు దాడి చేస్తాయని స్థానికులు నమ్ముతారు. అందుకే భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆలయాన్ని దర్శిస్తారు.
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, దేవరకొండ ప్రాంతాన్ని 13వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయకులు పాలించారు. ఆలయంలో కనిపించే పద్మాల చెక్కులను బట్టి ఈ నిర్మాణం కూడా అదే కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. కాలక్రమేణా చెట్లు విరిగిపడటం, ప్రకృతి ప్రభావంతో ఆలయం కొంత శిథిలావస్థకు చేరుకుంది. ఈ ఆలయ నిర్మాణం కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో స్తంభాలు నిర్మించి, వెనుక భాగంలో కొండను తొలిచి ఆలయాన్ని రూపొందించారు. నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు చాలా తేలికగా ఉండటం విశేషం. ఆలయ సమీపంలో మరో శిథిలమైన దేవాలయ ఆనవాళ్లు, శివలింగం చుట్టూ చిన్న లింగాలు కూడా కనిపిస్తాయి. ఆలయం పక్కనే ఉన్న గుహ నుంచి శ్రీశైలం వరకు సొరంగ మార్గం ఉందని స్థానికులు చెబుతుంటారు.
హైదరాబాద్కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి సమీపంలోనే నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ అందాలు కూడా కనువిందు చేస్తాయి. చుట్టూ గిరిజన తండాలు, కొండలు, అడవులు కలిసి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను సృష్టిస్తాయి. సరైన రోడ్లు, పర్యాటక సదుపాయాలు కల్పిస్తే దేవరచర్ల తెలంగాణలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. ప్రభుత్వం ఈ ఆలయానికి పూర్వవైభవం కల్పించాలని కోరుతున్నారు.
నోట్:- ఫొటోను ఏఐతో రిక్రియేట్ చేశాం. గమనించగలరు.
Read Also: లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!