Dharam Guruva Reddy: స్వేచ్చ బ్యూరో: పార్టీకి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పని చేయలేదని బీజేపీ సీనియర్ నాయకుడు ధరం గురువారెడ్డి చెప్పారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. వివరణ కోరుతూ తనకు అందిన లేఖ పార్టీ అంతర్గత విషయమని చెప్పారు. దానిని వక్రీకరించి తప్పుడు ప్రచారాలు చేయటం సరైంది కాదన్నారు. గజ్వేల్ లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు కుడిక్యాల రాములు, పవన్ నాగులపల్లి, అనంత్ సాయితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడం, కార్యకర్తలను రక్షించుకోవటం, ప్రజల్లో పార్టీని విస్తరించడమే లక్ష్యంగా నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా తాము ఎప్పుడూ పనిచేయలేదన్నారు. పార్టీ నిర్ణయాలను పార్టీ అంతర్గత వేదికలపైనే చర్చించి పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్ర పార్టీ పంపిన లేఖను సరిగ్గా చదివి అర్థం చేసుకుని మాట్లాడాలి..ఆ లేఖలో మమ్మల్ని సస్పెండ్ చేసినట్లు ఎక్కడా లేదని ధరం గురువారెడ్డి చెప్పారు. అయినా, తమపై వ్యక్తిగతంగా, రాజకీయంగా తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గత విషయాలను బయటకు తీసుకువచ్చి ప్రచారం చేయడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమన్నారు. తమపై వ్యక్తిగత ఆరోపణలు, తప్పుడు ప్రచారం కొనసాగితే తాము కూడా వాస్తవాలను ప్రజల ముందుంచాల్సి వస్తుందన్నారు. పార్టీ పేరుతో పదవులు అనుభవిస్తూ, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసిన వారి వ్యవహారాలపై పూర్తి వివరాలతో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. పార్టీకి సమర్పించిన ఆధారాలు, పత్రాలను కూడా వివరిస్తామని తెలిపారు. పార్టీని బలహీనపరచడం కాదు..బీజేపీని బలోపేతం చేయడమే మా లక్ష్యం అని చెప్పారు.
Also read: Operation Akarsh: బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ మాస్టర్ స్ట్రోక్.. పల్లా, మల్లారెడ్డి, గంగుల లిస్ట్ రెడీ?
జిల్లా అధ్యక్షుడికి రాష్ట్ర పార్టీ లేదా రాష్ట్ర స్థాయి నాయకులపై చర్యలు తీసుకునే అధికారం లేదన్నారు. పార్టీ రాజ్యాంగం, విధానాల ప్రకారం ప్రతి ఒక్కరూ వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ పదవిని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, కార్యకర్తలకు ఇబ్బందులు కలిగించడం, పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగ చర్చగా మార్చడం సరైన పద్ధతి కాదన్నారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తన తీరు మార్చుకుని, పార్టీ ఐక్యత మరియు బలోపేతం కోసం పనిచేయాలంటూహితవు పలికారు.
తమపై తప్పుడు వార్తలు ప్రచురించినా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, క్రిమినల్ డిఫమేషన్ చర్యలను కూడా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ఏకైక లక్ష్యమన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితర నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని నాయకులు తెలిపారు. పార్టీ అంతర్గత సమస్యలను పార్టీ వేదికలపైనే పరిష్కరించుకుంటామని, బయట తప్పుడు ప్రచారానికి తావివ్వబోమని స్పష్టం చేశారు.
Also Read: Rahul Gandhi: మోదీ సర్కార్కు రాహుల్ గాంధీ వార్నింగ్.. పేపర్ లీకుల లెక్కలు బయటపెట్టిన రాహుల్!