Iran Vs America: పశ్చిమాసియాలో ఒక్కసారిగా మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఉన్నట్లుండి ఇరాన్పై వివిధ ప్రాంతాల్లో దాడులకు దిగింది అమెరికా. ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్న వేళ, దాడుల ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో ఏం జరుగుతుందోనని టెన్షన్ ప్రపంచదేశాలను వెంటాడుతోంది.
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు
ఇరాన్పై మళ్లీ దాడులకు దిగింది అమెరికా. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్లో అమెరికా బలగాలు దాడులు చేపట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరాన్ బలగాల నుంచి మా సైనికులకు ముప్పు పొంచి ఉన్నందుకు ఈ దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది.
దీనిపై సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ నోరు విప్పారు. ఇరాన్కు చెందిన క్షిపణి ప్రయోగ కేంద్రాలు, హోర్మూజ్ జలసంధిలో ల్యాండ్ మైన్లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్టు వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే, తమ బలగాలను రక్షించుకునే చర్యలు కొనసాగిస్తామన్నారు.
ఇరాన్పై అమెరికా దాడులు.. క్షిపణి ప్రయోగ కేంద్రాలు ధ్వంసం
హర్మూజ్ జలసంధికి సమీపంలో బందర్ అబ్బాస్, సిరిక్, జాస్క్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు వినిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. బందర్ అబ్బాస్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపింది. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ రెండు పడవలు మైన్లు అమర్చుతుండగా అమెరికా బలగాలు వాటిని ధ్వంసం చేసినట్టు పేర్కొంది ఫాక్స్ న్యూస్. బందర్ అబ్బాస్లో క్షిపణి కేంద్రాన్ని కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఒక్కసారిగా ఇరాన్పై అమెరికా దాడులు చేయడంతో ప్రపంచ దేశాలకు కొత్త టెన్షన్ మొదలైంది.
ALSO READ: థాయిలాండ్ షాకింగ్ డెసిషన్.. భారతీయ పర్యాటకులకు ఉచిత వీసా రద్దు!
ఇరాన్-అమెరికా మధ్య ఇలాంటి ఉద్రిక్తతలు ఇంకా కొనసాగితే చమురు ధరలు పెరగడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇరాన్తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ప్రతిపాదిత ఒప్పందాలు చాలా పటిష్టంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు.
భారత పర్యటనలో ఉన్న ఆయన, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం కోసం తొందర పడలేదన్నారు. ఏ ఒప్పందమైనా అమెరికా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్నారు. హోర్ముజ్ జలసంధిని తెరవడం, అణు కార్యక్రమానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయని రూబియో తెలిపారు.