Monsoon Hillstations: వర్షాకాలంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం ఎంతో అహ్లాదకరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా కొండప్రాంతాలకు వెళ్లినప్పుడు పొందే అనుభూతి నెక్ట్స్ లెవెల్లో ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. అయితే వర్షాకాలంలో అలాంటి ప్రాంతాలకు వెళ్తే కొండచరియలు విరిగిపడటం, అకస్మిక వరదలు సంభవిస్తాయని చాలా మంది భయపడుతుంటారు. ఈ నేపథ్యంలో వర్ష రుతువులో కూడా సురక్షితంగా, ప్రశాంతంగా ప్రకృతి అందాలను ఆస్వాదించగలిగే కొన్ని అద్భుతమైన హిల్ స్టేషన్లు ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన షిమ్లా వర్షాకాలంలో మరింత అందంగా దర్శనమిస్తుంది. ఇక్కడి పచ్చని కొండలు, వాటిని తాకుతూ వెళ్లే మంచు మేఘాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ సమయంలో ఇక్కడి మాల్ రోడ్పై నడుస్తూ వేడి వేడి కాఫీ తాగడం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. మిగతా పర్వత ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి రోడ్డు మార్గాలు వర్షాకాలంలో కాస్త సురక్షితంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
హిమాలయాల ఒడిలో ప్రశాంతతను కోరుకునే వారికి ధర్మశాల, మెక్లియోడ్ గంజ్ సరైన గమ్యస్థానాలు. టిబెటన్ సంస్కృతికి నిలయమైన ఈ ప్రాంతాలు.. వర్షాకాలంలో సరికొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. చుట్టూ దట్టమైన దేవదారు వనాలు, జలపాతాలు కనువిందు చేస్తాయి. ఇక్కడి బౌద్ధ విహారాలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి.
ఉత్తరాఖండ్లోని నైనిటాల్ సరస్సుల నగరంగా పేరుగాంచింది. వర్షాకాలంలో ఇక్కడి నైని సరస్సు నీటితో కళకళలాడుతుంది. పడవ ప్రయాణం చేస్తూ చుట్టూ ఉన్న కొండలపై పడే వర్షపు చినుకులను చూడటం అద్భుతంగా ఉంటుంది. వర్షంలో తడిసిన ఇక్కడి పచ్చదనం పర్యాటకులకు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
ముస్సోరీని ‘కొండల రాణి’ అని కూడా పిలుస్తారు. దీనికి సమీపంలోనే ఉండే లాండూర్ చాలా ప్రశాంతమైన ప్రదేశం. ఇక్కడి బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు, పైన్ అడవులు వర్షంలో తడిసి మెరుస్తూ కనిపిస్తాయి. ముఖ్యంగా లాండూర్లో ఉండే నిశ్శబ్దం, మంచు దుప్పటి కప్పినట్లుండే వాతావరణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
రాజస్థాన్లోని ఏకైక హిల్ స్టేషన్ అయిన మౌంట్ అబు వర్షాకాలంలో తన అసలైన అందాలను బయటపెడుతుంది. వర్షాల వల్ల ఇక్కడి నఖి లేక్ నిండుకుండాల మారిపోతుంది. దాని చుట్టూ ఉన్న కొండలు పచ్చటి తివాచీ పరిచినట్లుగా లేక్ అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ఎడారి రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఈ కొండ ప్రాంతం వర్షాకాలంలో ఎంతో ఆహ్లాదకరంగా, సురక్షితంగా ఉంటుంది.
Also Read: వన్ప్లస్ సంచలనం.. అమెరికా, యూరప్ మార్కెట్లకు గుడ్ బై.. మరి భారత్ సంగతేంటి?
దక్షిణ భారత దేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడే వారికి తమిళనాడులోని కూనూర్ బెస్ట్ ఆప్షన్. ఊటీకి సమీపంలో ఉండే ఈ హిల్ స్టేషన్ నిండా టీ తోటలే ఉంటాయి. వర్షంలో తడిసిన టీ ఆకుల సువాసనలు, నీలగిరి పర్వతాల గుండా వెళ్లే టాయ్ ట్రైన్ ప్రయాణం పర్యాటకులను మైమరపిస్తాయి.
Also Read: అదృష్టమంటే ఇతనిదే.. దుబాయ్ లాటరీలో హైదరాబాదీకి రూ. 9.62 కోట్లు!