Rohingya Refugees: మయన్మార్ అంతర్యుద్ధం నుంచి ప్రాణాలతో బయటపడేందుకు పడవల్లో బయలు దేరిన సుమారు 500 మంది సముద్రంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. రోహింగ్యా శరణార్థులతో వెళ్తున్న రెండు పడవలు బంగాళాఖాతంలో మునిగిపోయినట్లు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. అందులోని వారంతా మరణించి ఉండొచ్చని ఐరాస అనుబంధం సంస్థలు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM), శరణార్థుల విభాగం (UNHCR) సంయుక్తంగా గురువారం ప్రకటించాయి.
జూన్ చివరి వారంలో మయన్మార్లోని రఖైన్ రాష్ట్రం నుండి రోహింగ్యా శరణార్థులతో రెండు నౌకలు బయలుదేరాయి. దాదాపు 250 మందితో ప్రయాణమైన మొదటి పడవ.. ప్రయాణం ప్రారంభించిన కొద్దిసేపటికే బాహ్య ప్రపంచంతో సంబంధాలను కోల్పోయింది. ఇక సుమారు 280 మందితో ప్రయాణిస్తున్న రెండవ బోటు జూలై 8న మయన్మార్ లోని అయేయార్వాడి తీరంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనల్లో భారీగా ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
సాధారణంగా రోహింగ్యాలు వర్షాకాలంలో సముద్ర ప్రయాణాలు చేయరు. ఈ సమయంలో రుతుపవనాల వల్ల సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల సముద్రంలో ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని తెలిసినప్పటికీ వారు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా ప్రమాదాలకు ముందే అండమాన్ తో పాటు బంగాళాఖాతం సముద్రాల్లో సుమారు 300 మందికి పైగా రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు మరణించడం గమనార్హం.
ఇదిలాఉంటే మయన్మార్ సైన్యం హింసకు తాళలేక దాదాపు 12 లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ కు పారిపోయి అక్కడి శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అమెరికా వంటి దేశాలు విదేశీ సహాయాన్ని భారీగా తగ్గించడంతో ఈ శిబిరాల్లో వారికి రేషన్ కొరత ఏర్పడింది. స్వదేశానికి సురక్షితంగా తిరిగి వెళ్లే మార్గం లేకపోవడం, బంగ్లాదేశ్ శిబిరాల్లోనూ బతకడం కష్టంగా మారడంతో.. వీరు ప్రాణాలకు తెగించి మలేషియా వంటి దేశాలకు పాతపడిపోయిన బోట్లలో బయలుదేరుతున్నారు. ఈ ప్రమాదకర ప్రయాణాల్లో పసిపిల్లలు, గర్భిణీలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. 2025లో అత్యధికంగా 6,500 మంది రోహింగ్యాలు సముద్ర మార్గంలో పారిపోగా అందులో దాదాపు 900 మంది మరణించారు.
Also Read: రథయాత్ర భక్తులకు గుడ్ న్యూస్.. పూరీకి ప్రత్యేక రైళ్లు వచ్చేశాయ్!
మరోవైపు తాజా విషాదం రోహింగ్యాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోందని ఐరాస సంస్థలైన IOM, UNHCR పేర్కొన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ సముద్ర వలసల్లో ప్రాణనష్టాన్ని నివారించడానికి అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని కోరాయి. రక్షణ చర్యలను వేగవంతం చేయడం, మానవ అక్రమ రవాణా ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఇలాంటి ఘోరాలను అడ్డుకోగలమని స్పష్టం చేశాయి.
Also Read: వన్ప్లస్ సంచలనం.. అమెరికా, యూరప్ మార్కెట్లకు గుడ్ బై.. మరి భారత్ సంగతేంటి?